హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నవంబర్ మొదటి లేదా రెండో వారంలో శిక్షణను ప్రారంభించనున్నట్టు తెలిసింది. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఆధ్వర్యంలో 16,604 కానిస్టేబుల్ పోస్టులకు గాను 15,750 మందిని శిక్షణకు ఎంపిక చేసింది. వీరిలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. పోలీస్, అగ్నిమాపక శాఖలో డ్రైవర్ పోస్టుల జాబితాను వాయిదా వేసింది. ఇప్పటికే ఎస్సై ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు టీఎస్పీఏలో శిక్షణ పొందుతున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెల 7 నుంచి 10 వరకు ధ్రువీకరణ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో ఎస్బీ వెరిఫికేషన్ను పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు సుమారు నెల రోజులపైనే పడుతుందని టీఎస్ఎల్పీఆర్బీ వర్గాలు తెలిపాయి. నెలరోజుల్లోగా పూర్తి చేసి, నవంబర్ మొదటి లేదా రెండోవారంలో శిక్షణను ప్రారంభించనున్నారు.
టీఎస్ఎల్పీఆర్బీ నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాల నియాకమ ప్రక్రియ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు నేతృత్వంలో విజయవంతంగా ముగిసింది. నిరుడు ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి బుధవారం ఫలితాలు విడుదలయ్యే వరకూ వివిధ దశల్లో చేపట్టిన నియామక ప్రక్రియను బోర్డు పకడ్బందీగా నిర్వహించింది. ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు, తుది రాతపరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ప్రొవిజనల్ సెలక్షన్, రిజర్వేషన్లు, క్యాటగిరీల వారీగా అర్హుల ఎంపిక, తుది ఫలితాల వరకూ బోర్డు పారదర్శకంగా వ్యవహరించింది. గర్భిణులు, మార్కులు, కొలతలు, రిజర్వేషన్ల విషయంలో పలువురు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లినా, వారి అనుమానాలను హైకోర్టు ద్వారానే నివృత్తి చేస్తూ, న్యాయస్థానం సూచనలు పాటిస్తూ వచ్చింది. ఉద్యోగాలు ఇస్తామని నమ్మించే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, అలాంటి వారిని పట్టిస్తే రూ.3 లక్షల రివార్డు సైతం ఇస్తామని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ప్రకటించారు.