మహబూబ్నగర్ : దేశంలోని వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం అంబానీ, ఆదానీలకు అప్పజెప్పేందుకు కుట్ర చేస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరికి నిరసనగా జిల్లా కేంద్రంలోని జెడ్పీ గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ, శవయాత్ర నిర్వహించారు.
ఈ ర్యాలీలో మంత్రి డప్పు కొడుతూ శవయాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు వివిధ రకాలుగా నిరసన తెలిపారన్నారు.
తెలంగాణ రైతాంగం వైపు దేశం చూస్తుంది. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు ప్రజలు తెలంగాణలో కలపండి అంటున్నారు. 2014 కంటే ముందు తరువాత తెలంగాణా రైతాంగం ఎలా వుందో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని మంత్రి తెలిపారు. కేంద్రం తెలంగాణ రైతులను మోసం చేస్తుందని మండి పడ్డారు. ధాన్యం కొననంటుంది.
విద్యుత్ రంగ సంస్థల్ని కూడా ప్రైవేట్కి అప్పజెప్పాలని చూస్తుందని మండిపడ్డారు. అన్ని ప్రైవేట్ పరం చేస్తూ దేశాన్ని తిరోగమనంలో నడిపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్లో కొంటరు. తెలంగాణ లో కొనరు..పంజాబ్ కో న్యాయం..తెలంగాణకు ఓ న్యాయమా అని కేంద్రాన్ని ప్రశ్నించారు.