యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 8 : కేసీఆర్ సర్కార్ యాదగిరిగుట్టకు మంజూరు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సీఎం రేవంత్రెడ్డి కొడంగల్కు తరలించేందుకు యత్నిస్తున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆరోపించారు. కష్టపడి సాధించిన వైద్య కళాశాలను తరిలిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నెలాఖరులోగా గుట్టలోని వైద్య కళాశాలకు శంకుస్థాపన చేసిన వంద పడకల దవాఖానను నిర్మించడంతోపాటు మల్లాపురం సర్వే నంబర్ 64లో వైద్య కళాశాలను నిర్మించేందుకు పనులు ప్రారంభించాలని, లేకపోతే మార్చి ఒకటి నుంచి గుట్టలో రిలే నిరాహర దీక్షలు చేపట్టనున్నట్టు ప్రకటించారు.
గురువారం ఆమె యాదగిరిగుట్ట పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రూ. 1,250 కోట్లతో యాదగిరిగుట్ట దేవస్థానాన్ని ప్రపంచమే గర్వపడే విధంగా కేసీఆర్ తీర్చిదిద్దినట్టు కొనియాడారు. జిల్లాలో ఎయిమ్స్ వైద్యశాల ఉన్నప్పటికీ పేదలకు ఎలాంటి సేవలు అందడం లేదని అన్నారు. యాదగిరిగుట్టకు ప్రభుత్వ మెడికల్ కళాశాల కావాలని కొట్లాడి తెచ్చుకున్నామని తెలిపారు. కేసీఆర్ రూ.183 కోట్లు కేటాయించి 2023 జూలై 5న యాదగిరిగుట్టకు 100 ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యం కలిగిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎం రేవంత్రెడ్డి అవసరమైతే కొడంగల్కు కొత్తగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసుకునే వీలున్నదని సూచించారు. అంతేగాని ఇక్కడి నుంచి తరలించడం సరికాదని అన్నారు. నెలాఖరు వరకు మెడికల్ కళాశాలపై స్పష్టతనివ్వాలని, తమ విజ్ఞప్తిని పట్టించుకోకపోతే ఉద్యమానికి తెర లేపుతామని హెచ్చరించారు.