ఖమ్మం, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎమ్మెల్సీ కవితపై సీబీఐ విచారణ వెనుక బలమైన కుట్ర దాగి ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఆదివారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరపాలని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ కుట్ర భగ్నం కావడంతో ఈడీ, సీబీఐ విచారణ తీవ్రత పెంచాయని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను బెదిరించి బీజేపీలో చేరేలా ప్రోత్సహిస్తున్నట్టుగా బీజేపీ చర్యలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. కేంద్రం అన్ని రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటివరకు ఈడీ ఎంతమంది బీజేపీ నాయకులపై దాడులు చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ గుజరాత్లో ఆప్, ఎంఐఎంను అడ్డం పెట్టుకుని గెలిచినట్టు ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీకి పతనం ప్రారంభమైందని హెచ్చరించారు.