హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీని ఎదిరించే సత్తా గల ఏకైక నేత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావేనని ఎమ్మెల్యే వివేకానందగౌడ్ అన్నారు. కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకొనేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తున్నదని, అందులో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీ దాడులు చేస్తున్నదని ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న తెలంగాణకు కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదని మండిపడ్డారు. ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాలను వదిలేసి కేవలం హైదరాబాద్లోనే ఐటీ దాడులు చేస్తున్నారని, ఇదంతా రాష్ట్రంలో వ్యాపారాలను దెబ్బతీసేందుకేనని ధ్వజమెత్తారు. కేంద్రం తన జేబు సంస్థలపైన ఎలాంటి దాడులు జరుగవని విమర్శించారు. దేశమంతా తెలంగాణ మాడల్, కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని పేర్కొన్నారు. అదానీ గుట్టు రట్టు కావడంతో మోదీ బెంబేలెత్తుతున్నారని ఎద్దేవాచేశారు. అదానీ అవకతవకలను మొదట ఎత్తి చూపింది తెలంగాణేనని చెప్పారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్, దేశ రాజధాని ఢిల్లీలో కరెంట్ కోత, నీటికి కటకట ఉన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ వంటి నాయకుడు తమ రాష్ర్టానికి సీఎంగా ఉంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని, కేటీఆర్ వంటి ఐటీ శాఖ మంత్రి తమకు ఉంటే విశాఖపట్నానికి ఎన్నో కంపెనీలు వచ్చేవని ఏపీ ప్రజలు అంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.