నల్లగొండ : నేడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొన్ని జాతీయ పార్టీలు మళ్లీ కుట్రలకు తెరలేపాయి. తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న కుట్రలను గ్రహించాలని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎందరో అమరుల పోరాటంతో నిజాం పాలన పోయి మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు.
తెలంగాణలో ఉన్న వనరులపైన కన్నేసిన ఆంధ్ర నాయకులు మన ప్రాంతంపైన కుట్ర చేశారు. ఆంధ్ర నాయకుల దోపిడీ నుండి విముక్తి కోసం 60 యేండ్లు తెలంగాణ ప్రజానీకం పోరాటం చేసిందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.
ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్కు మనం అందరం తోడుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డా.బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.