హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అత్యుత్సాహం, అనాలోచిత నిర్ణయం ఫలితంగా ప్రాణహిత ఫలాలు ఈ ఏడాది చేజారిపోయాయి. వేల ఎకరాలు ఎండిపోవాల్సిన దుస్థితి వచ్చింది. ఏడాదిలో దాదాపు 10 నెలల పాటు ప్రాణహితలో ప్రవాహాలు కొనసాగుతాయి. ప్రస్తుతం గోదావరిలో ప్రవాహం లేకపోయినా ప్రాణహితలో ఇప్పటికీ 1,470 క్యూసెకుల ప్రవాహం కొనసాగుతున్నది. మార్చి రెండో వారం వరకు కూడా అకడ రోజుకు అర టీఎంసీకి పైగా జలాలు వచ్చాయి. అంటే నీటి లభ్యతను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ అకడ ప్రతిపాదించారు. దాదాపు ఐదేండ్ల పాటు ఆ ఫలాలను రైతాంగానికి అందించారు.
ఎప్పుడు నీళ్లు అవసరమైనా ఎత్తిపోశారు. కానీ గత అక్టోబర్లో మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు గురవటం, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) అధికారుల బృందం బరాజ్లను సందర్శించటం, నీటి స్టోర్ చేయవద్దని సూచించిన విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సరారు రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ.. నీటిని ఎత్తి పోసే అంశాన్ని పక్కనబెట్టిందని సాగునీటి రంగ నిపుణులు చెప్తున్న మాట.
ప్రాణహిత జలాలను ఒడిసిపట్టే అంశాన్నే వదిలేసిందని వాదిస్తున్నారు. మేడిగడ్డ ఎగువన ఇసుక బస్తాలు వేయటం వంటి చిన్నపాటి చర్యలు చేపట్టి ప్రాణహిత జలాలను లక్ష్మీపంప్ హౌజ్ ఫోర్బేకు తరలించి నీళ్లను ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా దానిపై దృష్టి పెట్టలేదని స్పష్టం చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ అక్టోబర్లో చెప్తే ఫిబ్రవరి వరకు అన్నారంలో బరాజ్లో నీళ్లను మాత్రం అలానే ఉంచిందని గుర్తుచేస్తున్నారు. కనీసం ఆ జలాలనైనా ఎల్లంపల్లికి మళ్లించి ఉంటే ఇప్పుడు తాగునీటికి కటకట ఉండేది కాదని పలువురు అధికారులు వివరిస్తున్నారు. నిల్వ ఉన్న నీళ్లను సైతం ముందస్తు ఆలోచన లేకుండా దిగువకు వదిలిందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాల గురించి ఏ కొంచెం ఆలోచించినా దాదాపు 10-15 టీఎంసీలను ఎత్తిపోసుకునే అవకాశం ఉండేదని తేల్చి చెప్తున్నారు.