Kotha Prabhakar Reddy | హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి హత్యారాజకీయాలకు ఒడిగడుతున్న కాంగ్రెస్.. దాన్నుంచి తప్పించుకోవడానికి ఫేక్ ప్రచారానికి తెగబడింది. కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్త అని స్పష్టంగా తెలిసిపోతున్నా.. దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు నకిలీ ఫొటోలు, వీడియోలతో మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ సమక్షంలో బీజేపీలో చేరిన ఓ వ్యక్తి ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేసి.. అతడే ప్రభాకర్రెడ్డిపై దాడికి పాల్పడ్డట్టు రేవంత్ బ్యాచ్ తొలుత ప్రచారం చేసింది. తర్వాత రాజు మెడలో గులాబీ కండువా ఉన్నట్టుగా ఓ ఫొటోను మార్ఫ్ చేసి అతడు బీఆర్ఎస్ కార్యకర్తే అని మోసగించే ప్రయత్నం చేసింది. రేవంత్ బ్యాచ్ బండారాన్ని సోషల్ మీడియా బట్టబయలు చేసింది.
దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ కత్తేనని తేలిపోయింది. అత్యంత క్రూరంగా ఈ దాడికి పాల్పడింది మిరుదొడ్డి మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త గటాని రాజుగా గుర్తించారు. అతను కాంగ్రెస్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు తేలింది. అయితే దాడితో తమ పార్టీకి, తమ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సిగ్గులేకుండా సన్నాయి నొక్కులు నొక్కారు. రేవంత్రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని తేలిపోయింది. సోషల్ మీడియాతో వారి బండారం బయటపడింది. దాడికి పాల్పడిన గటాని రాజు తన సోషల్ మీడియా అకౌంట్లో కాంగ్రెస్కు మద్దతుగా పోస్ట్లు పెట్టాడు. మెడలో కాంగ్రెస్ కండువాతో ఉన్నటువంటి ఫొటోను డీపీగా పెట్టుకున్నాడు. అంతే కాకుండా గతంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించాడు. ఇందుకు సంబంధించి ప్రచార రథంపై తాను మాట్లాడుతున్న ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తన సోషల్ మీడియా అకౌంట్లో ‘జై కాంగ్రెస్ మిరుదొడ్డి మండల్’ ట్యాగ్లైన్ రాసుకోవడం అతడు క్రియాశీల కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పేందుకు మరో ప్రధాన సాక్ష్యం. దాడి జరిగిన తర్వాత రాజు సంబంధించి సోషల్ మీడియా పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అతను కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తేనని సోషల్ మీడియా కోడై కూసింది.
రేవంత్ దిగజారుడు మాటలు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారనడానికి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటన మరో సాక్ష్యంగా నిలిచింది. తన తోటి వ్యక్తిపై కత్తి దాడి జరిగితే దాన్ని ఖండించడం కనీస ధర్మం. కానీ రేవంత్రెడ్డి మాత్రం దాడిని ఖండించకుండా ఘటనకు రాజకీయ రంగు పులిమే కుటిల యత్నం చేశారు. అంతటితో ఆగకుండా ‘మొండి కత్తి’ అంటూ అవహేళనగా మాట్లాడారు. ఈ ఘటనపై అంబర్పేట కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడుతూ… బీజేపీ, బీఆర్ఎస్ సానుభూతి కోసం వాళ్ల అభ్యర్థిపై మొండి కత్తితో దాడి చేయించి దాన్ని కాంగ్రెస్ ఖాతాలో రాయాలని చూస్తున్నారంటూ నిస్సిగ్గుగా ఆరోపణలు చేశారు. పైగా తప్పుడు ఫొటోను పట్టుకొని ఆ అభ్యర్థి రఘునందన్రావు సమక్షంలో బీజేపీలో చేరాడంటూ.. ఆ వ్యక్తి తమ కార్యకర్త కాదు అని చెప్పేందుకు పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించదంటూ సుద్దులు చెప్పారు. మరో అడుగు ముందుకేసి శాంతి అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటూ గౌతమ బుద్దిడి మాదిరిగా బోధనలు చెప్పారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ సోషల్మీడియాలో వైరల్ చేసిన వీడియోలోని వ్యక్తి స్వయంగా బయటకొచ్చి తాను రాజును కాదని, తన పేరు నర్సింహులని చెప్పాడు. తాను ఆదివారం రఘునందన్ సమక్షంలో బీజేపీలో చేరానని, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తానే ప్రభాకర్రెడ్డిపై దాడి చేశానంటూ ఆ ఫొటోను సోషల్మీడియాలో వైరల్ చేశారని మండిపడ్డాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలపడంతో కాంగ్రెస్ బండారం బయటపడింది. కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడి చేసింది ఫక్తు కాంగ్రెస్ కార్యకర్తేనని తేలిపోవడం ఈ ఎన్నికల్లో తమపార్టీకి పుట్టగతుల్లేకుండా చేస్తుందని గ్రహించిన రేవంత్రెడ్డి.. దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హత్యా రాజకీయాలు, ఫేక్ రాజకీయానికి పాల్పడ్డ కాంగ్రెస్పై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఇంత దారుణం జరిగినా దాన్ని ఇంకా కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని కాంగ్రెస్పై ఫైర్ అవుతున్నారు.