సూర్యాపేట : రైతుబంధు ఆపిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఖతం చేయాలని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. రైతుబంధు పంపిణీ నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై సోమవారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. రైతుబంధు(Rythubandhu) విషయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు దురదృష్టకరం అన్నారు. ఆ నాడు కుట్రపూరితంగా కాంగ్రెస్ ఆపితే నేడు ఎన్నికల కమిషన్ రూపంలో ఆటంకం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆపగలిగేది ఈ నాలుగు రోజులే ఆన్న మంత్రి, రైతులకు ఎలాంటి బెంగ అవసరంలేదన్నారు.
తాత్కాలిక ఆటంకాలతో అధైర్యపడొద్దన్నారు. ఎన్నికల తరువాత యధావిధిగా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని పేర్కొన్నారు. మళ్లీ కేసీఆరే హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు. కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉండగా రైతుబంధు, 24 గంటల కరెంటు, రైతు బీమాతో పాటు ఏ ఒక్క సంక్షేమ పథకం ఆపేవాడు ఎవడు లేరాన్నారు. ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవొద్దన్నారు. సూర్యాపేటలో 12 స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.