Congress | హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఎస్సీలకు రిజర్వ్ చేసిన మూడు ఎంపీ టికెట్లను కాంగ్రెస్ పార్టీ మాల సామాజికవర్గానికే కట్టబెట్టినట్టయ్యింది. ఈసారి కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం మాదిగ సామాజికవర్గానికి దక్కకుండా పోయింది. సోమవారం ఉదయం ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ పెండింగ్లో ఉన్న వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం. ఖమ్మం అభ్యర్థిని మాత్రం ఈ నెల 9న జరిగే సీఈసీలో ఖరారు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే, ఖరారు చేసిన ముగ్గురు అభ్యర్థుల్లో వరంగల్ అభ్యర్థిని మాత్రమే ప్రకటించి, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులను ప్రకటించలేదు. వీటిని పెండింగ్లో పెట్టడంలో ఆంతర్యం ఏమిటో తెలియరాలేదు. కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్రావు పేరు ఖరారు అయినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. హైదరాబాద్ అభ్యర్థి ఎవరన్నది బయటకు పొక్కడం లేదు. కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రంలోని నాగర్కర్నూల్ (మల్లు రవి), పెద్దపల్లి (గడ్డం వంశీ), వరంగల్ (కడియం కావ్య) మూడు ఎస్సీ రిజర్వ్ స్థానాలను మాల సామాజికవర్గానికే కేటాయించడంతో ఒక్క టికెట్టు కూడా దక్కని మాదిగ సామాజికవర్గం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
పంతం నెగ్గించుకున్న రేవంత్రెడ్డి
వరంగల్ ఎంపీ టికెట్ విషయంలో పీసీసీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. ఇక్కడినుంచి తనకు సన్నిహితుడైన దొమ్మాటి సాంబయ్యకు టికెట్ ఇప్పించాలని మొదటి నుంచి రేవంత్రెడ్డి మొగ్గుచూపారు. అయితే కడియం శ్రీహరి తన మాట మీద కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆయన కూతురు కావ్యకు టికెట్ ఇప్పించేందుకు అధిష్ఠానంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చి సఫలీకృతం అయినట్టు పార్టీ వర్గాల సమాచారం. కడియం శ్రీహరికి లేదా ఆయన కూతురు కావ్యకు టికెట్ ఇవ్వడాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. వీరిని పార్టీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కూడా జరిగాయి. అయితే అది పార్టీ అధిష్ఠానం నిర్ణయమని చెప్పి సీఎం రేవంత్రెడ్డి ముఖ్యనేతల నోళ్లు మూయించినట్టు తెలిసింది. తన మాట మీద పార్టీలో చేరిన కడియం శ్రీహరి కూతురుకు టికెట్ ఇప్పించడాన్ని రేవంత్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య బలహీనమైన అభ్యర్థి అవుతుందని పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు హెచ్చరించినప్పటికీ, గెలిపించుకొచ్చే బాధ్యత తనదేనని రేవంత్రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు హామీ ఇచ్చి తన పంతం నెగ్గించుకున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.