Meenakshi Natarajan | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్.. సచివాలయంలో సమీక్షలు నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఏ హోదాలో సమీక్షలు, స మావేశాలు నిర్వహిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గాంధీభవన్కు పరిమితం కావాల్సిన మీనాక్షి నటరాజన్ షాడో సీఎంగా సచివాలయంలో సమీక్షలు పెడుతుంటే.. అసలు సీఎం రేవంత్రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షలు చేసుకోవటంపై వి స్మయం వ్యక్తమవుతున్నది. ఢిల్లీ నుంచి రైల్లో రా వాలని తెలిసిన ఆమెకు సచివాలయంలో మంత్రులు, అధికారులతో పార్టీ నేతలు సమీక్షలు నిర్వహించటం రా జ్యాంగ విరుద్ధమని తెలియదా? అని పరిశీలకులు విమర్శిస్తున్నారు.
కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యనేత బీజేపీ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని, దేశవ్యాప్తంగా సెంట్రల్ వర్సిటీల అధ్యాపకులు, విద్యార్థులతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సత్సంబంధాలను చెడగొట్టడం కోసమే అలా వ్యవహరిస్తున్నారని అధిష్ఠానానికి నివేదికలు అందినట్టు ప్రచారం జరుగుతున్నది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను హైదరాబాద్కు పంపినట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్నది. శనివారం ఆగమేఘాలపై హైదరాబాద్కు వచ్చిన నటరాజన్ నేరుగా రాష్ట్ర సచివాలయంలో అడుగు పెట్టారు. అప్పటినుంచి వరుసగా ఆమె షాడో సీఎం తరహాలో మంత్రులను, బ్యూరోక్రాట్లను, అధికారులను పిలిచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం కూడా ఆమె సచివాలయం మంత్రులతో సమీక్ష నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అన్నట్టుగా ఆమె విద్యార్థులు, ప్రజాసంఘాల నుంచి వినతి పత్రాలు స్వీకరించటం, వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటం రాజ్యాంగ ఉల్లంఘనే అని సచివాలయ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్లో నిర్వహించాల్సిన సమావేశాలు ఢిల్లీలో పెడతారని, గాంధీభవన్లో జరగాల్సిన సమావేశాలను సచివాలయంలో పెడతారని సెటైర్లు వేస్తున్నారు. సీఎం అయ్యాక 41 సార్లు ఢిల్లీకి వెళ్లి సమావేశాలు, సంప్రదింపులు జరిపిన రేవంత్రెడ్డి అందులో సగం అంటే కనీసం 20 సార్లు కూడా సచివాలయంలో అధికారులతో సమీక్షలు నిర్వహించలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. హెచ్సీయూ క్యాంపస్ గదుల నుంచి విద్యార్థులను బయటికి రానివ్వని పోలీసులు, మీనాక్షికి మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రభుత్వ లాంఛనాలతో వర్సిటీలోకి తీసుకెళ్లడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.
మీనాక్షి హెచ్సీయూ భూముల వ్యవహారానికే పరిమితం అవుతారా? లేక అన్ని అధికారిక వ్యవహారాల్లో తలదూరుస్తారా? అని ముఖ్యనేత సహా కీలక నేతలు ఆందోళన పడుతున్నట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది. పార్టీ ఇన్చార్జి ఇలా సచివాలయానికి వచ్చి అధికారిక సమీక్ష నిర్వహించడంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని మంత్రులు ఆందోళన చెందుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మీనాక్షి నటరాజన్ షాడో సీఎంగా చక్కబెడుతున్న పనులతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనన్న చర్చ ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో జోరందుకున్నది.