వరంగల్, జూలై 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్, బీజేపీ నేతలు తన్నుకొన్నారు. హనుమకొండ జిల్లా బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దాడులకు ప్రయత్నించగా.. బీజేపీ శ్రేణులు కర్రలతో ఎదురుదాడికి దిగాయి. వివరాల్లోకి వెళ్తే.. విభజన చట్ట హామీలను నెరవేర్చాలని, అగ్నిపథ్ను రద్దు చేయాలన్న డిమాండ్తో శుక్రవారం కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. రాజస్థాన్కు చెందిన బీజేపీ ఎంపీ ఓంప్రకాశ్ మాథుర్ బీజేపీ హనుమకొండ జిల్లా కార్యాలయానికి వచ్చారని తెలుసుకొన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కార్యకర్తలతో బీజేపీ ఆఫీసుకు చేరుకొన్నారు.
అదే సమయంలో హైదరాబాద్లో మోదీ బహిరంగసభ జన సమీకరణ కోసం ఓంప్రకాశ్ మాథుర్ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించిన విషయం తెలుసుకొన్న బీజేపీ కార్యకర్తలు కట్టెలతో ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్ నేతల వాహనాలనూ ధ్వంసం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు జెండా కర్రలతో బీజేపీ వారిపై ప్రతిదాడులు చేశారు. ఇరుపార్టీల నేతల కొట్లాటతో హంటర్రోడ్డు ప్రాంతం రణరంగంగా మారింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పర దాడుల క్రమంలో ఓ పోలీసు గాయపడ్డాడు. దాడులను నియంత్రించేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేశారు. దాడులకు కారకులైన వారిపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సుబేదారి పోలీసులు తెలిపారు.