మల్లాపూర్, ఫిబ్రవరి 26: విజయ సంకల్ప యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కలిసి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో మూతపడిన చక్కెర కర్మాగారం సందర్శనకు ప్లాన్ చేశారు. దీనిని నిరసిస్తూ సోమవారం కర్మాగారం ఎదుట కిసాన్సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు వాకిటి సత్యంరెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కొమ్ముల చిన్నారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ‘గో బ్యాక్ కిషన్రెడ్డి’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న ఎంపీ ఎన్నికల దృష్ట్యా రైతులను మోసం చేసేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే ప్రకటించిన పసుపు బోర్డుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేశారు.