హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. రాష్ట్రంలోని 238 ప్రతినిధులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ జగురుతున్నవేళ గాంధీభవన్ వద్ద మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వీరంగం సృష్టించారు. జనగామ జిల్లాకు చెందిన శ్రీనివాస్ రెడ్డిని ఓటు వేయకుండా పీఆర్వో అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 45 ఏండ్ల కాంగ్రెస్ మనిషికి అవమానం జరిగిందని విరుచుకుపడ్డారు. ఓటరు లిస్టునుంచి శ్రీనివాస్ రెడ్డి పేరును చివరి క్షణంలో ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. అయితే పీఆర్వోతో వాగ్వాదానికి దిగిన పొన్నాలను సీనియర్ నేత జానారెడ్డి సముదాయించి అక్కడినుంచి తీసుకెళ్లారు.
అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రతి నియోజకవర్గంనుంచి ఇద్దరికి అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా జనాగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య, చెంచారపు శ్రీనివాస్ రెడ్డికి ఏఐసీసీ ఓటింగ్ కార్డు జారీచేసింది. అయితే గత రాత్రి శ్రీనివాస్ రెడ్డి స్థానంలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును రాష్ట్ర నాయకత్వం చేర్చింది. దీంతో ఓటు వేయడానికి గాంధీభవన్కు వచ్చిన శ్రీనివాస్ రెడ్డిని పీఆర్వో సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై అక్కడే ఉన్న పొన్నాల.. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రికిరాత్రే కొమ్మూరి పేరును ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. శ్రీనివాస్ రెడ్డికి ఓటువేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇద్దిరినీ ఓటేయకుండా పీఆర్వో సిబ్బంది ఆపేశారు.