హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య వైరం మరోసారి బయటపడింది. నల్లగొండలో రేవంత్రెడ్డి సన్నాహక సమావేశంపై కోమటిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నా జిల్లాకు రావాల్సిన అవసరం లేదు’ అని రేవంత్రెడ్డికి స్పష్టం చేశారు. ఈ జిల్లాలో తాము బలంగానే ఉన్నామని, సర్పంచ్ కూడా లేని జిల్లాల్లో, మండలాల్లో సమావేశాలు పెట్టుకోవాలని కుండబద్దలు కొట్టారు. ఈ నెల 6న వరంగల్లో రాహుల్గాంధీ సభ నేపథ్యంలో రేవంత్రెడ్డి అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగానే శుక్రవారం నల్లగొండలో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, అవసరమైన జనసమీకరణ, ఏర్పాట్లు తాము చేస్తామని, రేవంత్రెడ్డి రావాల్సిన అవసరమేమీ లేదని కోమటిరెడ్డి తేల్చి చెప్పారు. కోమటిరెడ్డి వ్యతిరేకిస్తున్నా సమావేశానికి ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి జిల్లా నేతలను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో కోమటిరెడ్డి మరింత ఆగ్రహం వ్యక్తం చేసి.. తన మాట వినకుండా రేవంత్ సమావేశం పెట్టినా, తాను మాత్రం హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జానారెడ్డి జోక్యం చేసుకొని సమావేశాన్ని నల్లగొండలో కాకుండా నాగార్జునసాగర్లో నిర్వహించేందుకు ఒప్పించారు.