ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం, బలగం. అలాంటి కార్యకర్తలను ఏ పార్టీ అయినా కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇందుకు విరుద్ధం. సొంత పార్టీ కార్యకర్తలనే రోడ్డుపాలు చేస్తున్నది. వారి కోసం కనీసం ప్రమాద బీమా కూడా చెల్లించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఆ పార్టీ ఉన్నది. దీంతో పార్టీ కోసం పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలు రోడ్డుపాలవుతున్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ తన కార్యకర్తలను కంటికిరెప్పలా కాచుకొంటున్నది. నెల క్రితమే 26 కోట్ల బీమాను చెల్లించి కార్యకర్తలకు ధీమా ఇచ్చింది. ఇప్పటివరకూ 5 వేల మంది కార్యకర్తల కుటుంబాలకు 100 కోట్ల బీమా సాయం అందజేసి, కార్యకర్తల కుటుంబాలకు తానున్నాననే భరోసా కల్పించింది.
Congress | హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ 2022-23కు సంబంధించి సభ్యత్వ నమోదులో భాగంగా కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాద బీమాను కల్పించింది. సభ్యత్వ నమోదు చేసుకొన్న సుమారు 40 లక్షల మంది కార్యకర్తల కోసం రూ.6 కోట్ల వరకు బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించింది. అయితే ఈ ప్రీమియం గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి పార్టీ తరఫున రెన్యూవల్ చేయాల్సి ఉన్నది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పాలసీని రెన్యూవల్ చేయకుండా వదిలేసింది. దీంతో బీమా కంపెనీలు కార్యకర్తల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు నిరాకరిస్తున్నాయి.
కార్యకర్తల కోసం కోట్లు దండగ చేస్తమా?
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి 2021 డిసెంబర్ 9న ఇక్కడ డిజిటల్ సభ్యత్వాన్ని నమోదు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి స్థానంలో గతంలో ఎప్పుడూ లేనంతగా పార్టీ సభ్యత్వాన్ని చేయించాలని నిర్ణయించారు. తద్వారా అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేయాలని ప్రయత్నించారు. టార్గెట్ పెట్టి మరీ సభ్యత్వ నమోదు చేయించారు. ఆ తర్వాత చేతులు దులుపేసుకున్నారు. సభ్యత్వ నమోదు సమయంలో కార్యకర్తలపై చూపిన ప్రేమ.. ఆ కార్యకర్త చనిపోయాక అతడి కుటుంబంపై చూపడం లేదు. పాలసీ రెన్యూవల్ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినా దాన్ని పట్టించుకోలేదని తెలిసింది. ‘ఇప్పుడు అదేం అవసరం లేదులే… అనవసరంగా కోట్లు దండుగ చేసుడెందుకు?’ అని రేవంత్ అన్నట్టు సమాచారం.
కార్యకర్తల కుటుంబాలు రోడ్డుపాలు
కాంగ్రెస్ పార్టీ ఎంతో గొప్పగా కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేసింది. ప్రమాదంలో చనిపోతే రూ. 2 లక్షల బీమా వస్తుందంటూ నమ్మించింది. ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలు పార్టీ ఇచ్చిన ఐడీ కార్డులతో బీమా కంపెనీని ఆశ్రయించగా, వారికి నిరాశే ఎదురవుతున్నది. బీమా సొమ్ము ఇచ్చేందుకు కంపెనీలు నిరాకరిస్తున్నాయి. పాలసీ గడువు ముగిసిందని, పార్టీ రెన్యూవల్ చేయలేదని, తాము పరిహారం చెల్లించలేమని ముఖం మీదనే చెప్పేస్తున్నాయి. దీంతో ఆ కుటుంబాలకు బీమా సొమ్ము దక్కడం లేదు. పార్టీకోసం శ్రమిస్తూ ప్రాణాలు పోయిన కార్యకర్తల కుటుంబాలు ఇప్పుడు రోడ్డుపాలయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనిపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం తాము ప్రాణాలకు లెక్కచేయకుండా పనిచేస్తుంటే.. పార్టీ మాత్రం తమను కనీసం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పార్టీ కోసం తామెందుకు కష్టపడాలని, ప్రాణాలు ఎందుకు అర్పించాలని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం ప్రాణాలిచ్చి.. తమ కుటుంబాలను నాశనం చేసుకోవాల్నా? అని నిలదీస్తున్నారు.
కంటికిరెప్పలా కాపాడుకొంటున్న బీఆర్ఎస్
కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తలను, వారి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తుంటే.. బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన కార్యకర్తలను అక్కున చేర్చుకొంటున్నది. కార్యకర్తలకు, వారి కుటుంబాలకు అన్నీ తానై వ్యవహరిస్తున్నది. మరీ ముఖ్యంగా కార్యకర్తల ప్రమాద బీమా అంశంపై పార్టీ నిక్కచ్చిగా ఉంటున్నది. పాలసీ గడువు ముగియగానే రెన్యూవల్ చేస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగానే 2023-24 సంవత్సరానికిగానూ సెప్టెంబర్ 16వ తేదీన రూ.26 కోట్ల ప్రీమియం చెల్లించింది. తద్వారా సుమారు 60 లక్షల మంది కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నది. ఇదిలా ఉంటే పార్టీ చెల్లించిన ప్రమాద బీమా ద్వారా 5 వేల మంది కార్యకర్తల కుటుంబాలకు ఊరట లభించింది. ప్రమాదంలో చనిపోయిన ఆ కార్యకర్తల కుటుంబాలకు రూ.100 కోట్ల పరిహారాన్ని చెల్లించింది. ఇంత పెద్ద మొత్తంలో కార్యకర్తల కుటుంబాలకు పరిహారం చెల్లించిన పార్టీ ఒక్క బీఆర్ఎస్ మాత్రమే కావడం విశేషం.