Deepadas Munshi | హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పౌర సమాజానికి చెందిన పలువురు ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన అధికారిక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ పాల్గొనడం వివాదాస్పదమైంది. రాష్ర్టానికి సంబంధం లేని, ఎలాంటి అధికారిక హోదా లేని వ్యక్తిని సమావేశానికి ఎలా అనుమతించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఢిల్లీ పెద్దల పెత్తనానికి నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణకు చెందిన ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో దీపాదాస్మున్షీ కూర్చోవడంతో ‘ఇది తెలంగాణ పౌర సమాజంతో భేటీనా? ఢిల్లీ పౌర సమాజంతో భేటీ నా?’ అనే సెటైర్లు పేలుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంపై ఆ పార్టీ సీనియర్ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎవరితో సమావేశమవుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అనే అంశాలపై ఢిల్లీ కాంగ్రెస్ అధిష్ఠానం కన్నేసి ఉంచిందని, రేవంత్రెడ్డిని పూర్తిస్థాయిలో విశ్వసించడంలేదనే చర్చ నడుస్తున్నది. రేవంత్రెడ్డి కదలికలు, కార్యకలాపాలపై ఢిల్లీ అధిష్ఠానం ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచిందని చెప్తున్నారు.