Minister KTR | హైదారాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘రేవంత్కు చాన్స్ ఇస్తే తెలంగాణను కోఠిల చారాణకు అమ్మేస్తడు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి మార్పు కోసం హైదరాబాద్లో 400 మందిని పొట్టునపెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని గుర్తుచేశారు. కష్టపడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని ఆగం కానివ్వద్దని విజ్ఞప్తి చేశారు. అనేక దశాబ్దాలపాటు, అనేక త్యాగాలు చేసి వందల మంది విద్యార్థులను బలితీసుకున్న వారి చేతిలో తెలంగాణ పెడితే ఎలా ఉంటుందో ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ చేసిన మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్వీ విస్తృత సమావేశం జరిగింది.
బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ సహా 33 జిల్లాల బీఆర్ఎస్వీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. రానున్న 30 రోజుల్లో విద్యార్థి నాయకులు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియాను బ్రహ్మాస్త్రంగా వినియోగించుకొని కాంగ్రెస్, బీజేపీ సృష్టిస్తున్న గందరగోళాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గురుకులాల్లో చదివి ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఐఐఎం, నీట్, ఎన్ఐటీ వంటి సంస్థల్లో సీటు దక్కించుకున్న విద్యార్థులతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని చెప్పారు. ఈ తరం విద్యార్థులకు తెలంగాణ ఉద్యమం గురించి వివరించాల్సిన బాధ్యత తీసుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని, ఆ అన్యాయాలను కండ్లకు కట్టినట్టు వివరించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ‘1956లో తెలంగాణకు ఇష్టంలేని బలవంతపు పెండ్లి చేసింది కాంగ్రెస్సే. 1968లో 379 మంది విద్యార్థి, యువకులను పోలీస్ కాల్పుల్లో కాల్చి చంపింది కాంగ్రెస్సే. 2004లో తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చి తప్పుకోవటం వల్ల శ్రీకాంతాచారి, ఇషాన్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, యాదయ్య, యాదిరెడ్డి వంటి 1,200 మంది బలిదానాలకు కారణం బలిదేవత సోనియాగాంధీ కాదా?’ అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులను, యువజనులను గుర్తించి ఆదరించింది.. వారికి ప్రజాప్రతినిధులుగా, కార్పొరేషన్ల ఛైర్మన్లగా అవకాశం కల్పించింది సీఎం కేసీఆర్ అని చెప్పారు.
నియోజకవర్గాల్లో సమ్మేళనాలు పెట్టండి
రానున్న 30 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థి, యువజన సమ్మేళనాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం మీద, పార్టీ మీద విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే కార్యాచరణ రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో పోటీచేసేది సీఎం కేసీఆరే అన్న విషయాన్ని విద్యార్థి యువతకు చెప్పాలని సూచించారు. విద్వేషపు బీజాలు నింపుతున్న బీజేపీ నిజస్వరూపాన్ని, కర్కశ కాంగ్రెస్ రీతిని, నీతిని వివరించాలని కోరారు. కులం పేరుమీద రాజకీయాలు చేసేవారి పట్ల మన సమాజాన్ని అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు.