Telangana | అదే పట్టణం నల్లగొండ.. అదే గ్రౌండ్..మర్రిగూడ బైపాస్అంతే ప్రాంగణం.. బారికేడ్లు, హెలిప్యాడ్ కూడా మార్చలేదు.తేడా అల్లా కేవలం రెండు రోజుల వ్యవధి.20 నవంబర్ 2023న అక్కడ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. దానికి జనం పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అందులో పట్టక చాలామంది రోడ్లపైనే ఉండిపోయారు.
కేవలం 2 రోజుల తర్వాత బుధవారం అదే ప్రాంగణంలో కాంగ్రెస్ సభ నిర్వహించింది. పార్టీ గెలిస్తే తానే సీఎం అవుతానని గొప్పగా చెప్పుకొంటున్న, అత్యంత సీనియర్ నేతనని ఫోజులుగొడుతున్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పోటీ చేస్తున్న నియోజకవర్గమిది. సాక్షాత్త్తు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మణిక్రావ్ఠాక్రే తదితర అతిరథ మహారథులు ఈ సభ కోసం ఏతెంచారు. దీనికి పట్టుమని పదివేల మంది ప్రజలు కూడా హాజరుకాలేదు. ఖర్గే ప్రసంగం ప్రారంభించేందుకు వస్తుండగా ఒక్కొక్కరుగా లేచి వెళ్లిపోయారు. ‘పోకుర్రా భయ్.. పోకుర్రా భయ్’ అని జనాలను కోమటిరెడ్డి పదే పదే బతిమిలాడుకున్నా, చివరికి రెండువేలమంది కూడా మిగల్లేదు. ఇక్కడే కాదు.. గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలో నిర్వహించిన ఖర్గే సభలో కూడా ఖాళీ కుర్చీలే కనిపించాయి. అటు సిద్దిపేట జిల్లా సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సభ పెడితే వేదికముందు పట్టుమని రెండు వందలమంది కూడా కనిపించలేదు.
కొసమెరుపు: తెలంగాణ ఎన్నికల్లో అసలు పరిస్థితి ఇది. ఇదిట్లా ఉంటే సోషల్మీడియా సర్వేల పేరుతో కాంగ్రెస్ ఏదో గాలివీస్తోందని.. వేవ్ పూస్తోందని.. తెలంగాణ ఓటర్ల చెవిలో పువ్వులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నది. పైన పటారం.. లోన లొటారం. షేర్వానీ.. అందర్ పరేషానీ.. పోలింగ్కు ఇంక వారం రోజులు ఉండంగనే కాంగ్రెస్ ఖేల్ ఖతం.. కేసీఆర్దే విజయపథం.
నల్లగొండ/అయిజరూరల్/, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/అయిజ రూరల్: తెలంగాణను మొత్తం ఊపేస్తామని ఊదరగొడుతున్న కాంగ్రెస్ పార్టీది పైన పటారం.. లోన లొటారం అని తేలిపోయింది. హస్తం నేతలవి వట్టి గాలిమాటలేనని నల్లగొండ, అయిజలో బుధవారం నిర్వహించిన ఖర్గే సభలు, గజ్వేల్ రేవంత్ సభలతో తేటతెల్లమైంది. జనం లేక మొన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సభ వెలవెలపోగా.. నేడు సాక్షాత్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభలకు జనం రాకపోవడం.. వచ్చిన కొద్దిమందీ మధ్యలోనే జారుకోవడంతో ఆ పార్టీ ఖేల్ ఖతం అనే మాట వినిపిస్తున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎంనని చెప్పుకొంటున్న నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. సీఎం కేసీఆర్కు పోటాపోటీగా స్థానిక మర్రిగూడ బైపాస్రోడ్డులో ఏర్పాటు చేసిన సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మణిక్రావ్ఠాక్రే, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇంతమంది పెద్దలు పాల్గొన్న సభ అంటే పెద్దసంఖ్యలో జనం వస్తారని ఊహించిన కోమటిరెడ్డి బ్రదర్స్కు ఊహించని షాక్ తగిలింది.
ఖర్గే వచ్చే సమయానికే జనం తిరుగుముఖం పట్టారు. ఖర్గే ప్రసంగం ప్రారంభించేందుకు వస్తుండగా ఒక్కొక్కరుగా లేచి వెళ్లిపోయారు. దీంతో సభనుంచి వెళ్లొద్దంటూ జనాలను కోమటిరెడ్డి పదే పదే బతిమిలాడుకోవాల్సి వచ్చింది. అయినా కోమటిరెడ్డి మాటలు పట్టని జనం అక్కడినుంచి జారుకోవడంతో ఖాళీ కుర్చీలను చూస్తూ ఖర్గే ప్రసంగించారు. మొత్తంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేవలం 2000 మంది మాత్రమే మిగలడంతో కోమటిరెడ్డి, మణిక్రావ్ఠాక్రే తలలుపట్టుకొన్నారు.
జనం లేక వెలవెలబోయిన సభలో తాను ఎలా ప్రసంగించాలని అన్నారో ఏమో..ఖర్గే చేతులు పట్టుకొని కోమటిరెడ్డి బతిమిలాడటం కనిపించింది. సీఎం కేసీఆర్తో పోటాపోటీ అన్నట్టుగా సభ నిర్వహించాలని గొప్పలకుపోయిన కోమటిరెడ్డి రాజకీయ అహంకారంపై నల్లగొండ ప్రజలు గట్టిదెబ్బ కొట్టారు. కేసీఆర్లాంటి మహానాయకుడితో పెట్టుకున్నందుకు కోమటిరెడ్డి బ్రదర్స్కు తగిన శాస్తి జరిగిందని అక్కడున్న నాయకులే చర్చించుకోవడం కనిపించింది. కాగా, తమకు మంచి గ్రిప్ ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెప్పుకొనే నల్లగొండలోనే ఇట్లా ఉంటే ఇక తెలంగాణలో వాళ్ల పరిస్థితి ఏంటో తెలిసిపోతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కాంగ్రెస్ తీరుతో విసిగివేసారిన జనం
కాంగ్రెస్ చెప్పే గ్యాస్ మాటలతో తెలంగాణ ప్రజలు విసిగివేసారిపోయారు. ఆ పార్టీ నాయకులు చెప్పేవన్నీ వట్టిమాటలేనని జనం గ్రహించారు. అందుకే తెలంగాణలో జరుగుతున్న ఏ సభలకూ జనం రావడంలేదు. వచ్చినా సభ మొత్తం పూర్తవకుండానే వెనుదిరుగుతున్నారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో ఖర్గే సభ, సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పీసీసీ చీఫ్ రేవంత్ సభలు వెలవెలబోయాయి. అయిజలో హస్తం పార్టీ అభ్యర్థి సంపత్కుమార్ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేయగా, మల్లికార్జున ఖర్గే, మణిక్రావుఠాకూత్తోపాటు విజయశాంతి హాజరయ్యారు.
ఇంతమంది పెద్దలు హాజరైనా సభలో ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. నల్లగొండ సభలో జరిగిందే ఇక్కడకూడా పునరావృతమయ్యింది. ఖర్గే మాట్లాడుతుండగానే ఒక్కొక్కరుగా వెనుదిరిగారు. ఎవరూ వెళ్లొద్దని అభ్యర్థి సంపత్ మైక్లో మొరపెట్టుకున్నా జనం వినలేదు. అలాగే, సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి విజయభేరి ఎన్నికల సభ అట్టర్ఫ్లాప్ అయ్యింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ వచ్చిన కొద్ది సేపటికే సభా ప్రాంగణం నుంచి ప్రజలు జారుకోవడం కనిపించింది.
దీంతో అసహనానికి గురైన రేవంత్ అరగంటలోపే తన పసలేని ప్రసంగాన్ని ముగించారు. ఇదిలా ఉండగా, హస్తం నేతలవి వట్టి గాలిమాటలేనని ఖర్గే, రేవంత్ సభల సాక్షిగా తెలంగాణ ప్రజలకు అర్థమైపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ మీద గెలువబోమని తెలిసికూడా కాంగ్రెస్ నేతలు దింపుడుగళ్లెం ఆశలాగా గ్యాస్ మాటలతో మైండ్గేమ్ ఆడుతున్నారని వారు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు.. వట్టిమాటలతో ప్రజలు విసిగి వేసారిపోయారని, ఇందుకు ఆ పార్టీ నిర్వహిస్తున్న సభల్లో కనిపిస్తున్న ఖాళీ కుర్చీలే నిదర్శనమని వారు అంటున్నారు.