Harish Rao | పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మేలు జరిగేలా కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను బరిలో నిలిపిందని బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆరోపించారు. శనివారం సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన బీఆర్ఎస్ యువ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అధ్యక్షతన పటాన్చెరులో ఎంపీ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. రెండు సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరై హరీశ్రావు ప్రసంగించారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి మేలు జరిగేలా కాంగ్రెస్ వ్యహరిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ టికెట్ను సర్పంచ్గా పనిచేసిన వ్యక్తికి ఇచ్చిందన్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్లలో వీక్ క్యాండిడేట్లను కాంగ్రెస్ బరిలో నిలిపిందని విమర్శించారు. కరీంనగర్లో ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదన్నారు.
కాంగ్రెస్, బీజేపీ రెండు మిలాఖత్ అయినప్పటికీ ప్రజల అండతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ ఎప్పటికీ బీజేపీతో కలిసి పనిచేయదని స్పష్టం చేశారు. కేంద్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ పాలనలో పేదరికం, ధరలు, నిరుద్యోగం పెరిగాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగులు భర్తీ చేస్తామన్న బీజేపీ పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా కేవలం 6.50 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి యువతకు మోసం చేసిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఎంపీ ఎన్నికల్లో సైతం రాముడు పేరు చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. యువత బీజేపీ మత రాజకీయాలకు మోసపోకుండా తెలంగాణ కోసం అండగా నిలిచే బీఆర్ఎస్కు ఓటువేసి గెలిపించాలని హరీశ్రావు కోరారు.