హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టనున్న మేడిగడ్డ బరాజ్ యాత్రకు పోటీగా శుక్రవారం కాంగ్రెస్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శన యాత్రకు పిలుపునిచ్చింది. ఈ యాత్రలో ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొంటారని ఏఐసీసీ కార్యదర్శి, మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వంశీచందర్రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ గాంధీభవన్లో గురువారం ఆయా జిల్లాల ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో కృష్ణా పరీవాహక ప్రాంత ప్రాజెక్టులను కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు)కి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నల్లగొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించగా, అదేరోజు పోటీగా రాష్ట్రప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు యాత్రకు పోటీగా పాలమూరు ప్రాజెక్టు సందర్శనకు పాలకపక్షం పిలుపునిచ్చింది. అయితే ఈ యాత్రకు సీఎం రేవంత్రెడ్డి వెళ్తారా? లేదా? అన్న విషయం గోప్యంగా ఉన్నది.