‘సినిమాల్లో టైమ్పాస్ కోసం తెలంగాణ వస్తదా? రాదా? అని కామెడీ సీన్లు చూసే రోజుల నుంచి, కోటి ఎకరాల పంటతో దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదిగేలా చేసుకున్న ప్రజలకు తెలియదా ఏది వాపో.. ఏది బలుపో? ఎవరు కావాలో.. ఎవరు వద్దో?’
– మంత్రి కేటీఆర్
‘వచ్చే గవర్నమెంటు మాదే’ అని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారే ప్రగల్భాలు పలుకుతున్నారు. వచ్చిన తర్వాత మేం ఇది చేస్తాం, మేం అది చేస్తాం.. అని లిస్టు చదువుతున్నారు. కాంగ్రెస్ గ్యారంటీలిస్తున్నది. ఎన్నికలు రాగానే ప్రజలను మభ్యపెట్టేందుకు సిద్ధమైన ఇదే కాంగ్రెస్ పార్టీ అర్ధ శతాబ్దం పాటు ఈ ప్రాంతాన్ని పాలించినప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయింది? అధికారంలోకి వచ్చాక ఏమేమో చేస్తాం అని చెబుతున్న ఇదే బీజేపీ, తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇవన్నీ ఎందుకు చేయటం లేదు? తెలంగాణ ప్రజలు గుడ్డివాళ్లు కాదు. ఎవరిని ఎన్నుకోవాలో, ఎందు కు ఎన్నుకోవాలోప్రజలకు స్పష్టంగా తెలుసు.
తెలంగాణ ఏర్పడ్డాక ముచ్చటగా మూడోసారి ఎన్నికలు జరగబోతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో తిరుగులేని వేగంతో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. బీజేపీ-కాంగ్రెస్లు ఎన్నెన్నో హామీలతో వల విసురుతున్నాయి. కానీ, ఆ పార్టీల తరఫున పోటీ చేయడానికే బలమైన అభ్యర్థులు దొరకనప్పటికీ టికెట్ల అమ్మకానికి మాత్రం దుకాణాలు తెరిచిపెట్టారు.
తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు.. పనులు ఉండవు.. హైదరాబాద్లోని కంపెనీలన్నీ వెనక్కి వెళ్లిపోతాయి.. నక్సలైట్లు చెలరేగుతారు.. మీకసలు పాలన చేతకాదు వంటి అనేక అపహాస్యాల పునాదులపై కేసీఆర్ కట్టిన పాలరాతి సౌధం మన తెలంగాణ. ఇప్పుడు అరచేతిలో స్వర్గం చూపించే హామీలో, ఊకదంపుడు ఉపన్యాసాలో కాదు. ప్రజలకు ఏం కావాలో.. ఏం ఇవ్వాలో.. ఎలా చేయాలో తెలిసిన నాయకత్వం కావా లి. ఒక కొత్త రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్వన్గా తీర్చిదిద్దటంలో అహరహం శ్రమించే నిత్య శ్రామికుడే తెలంగాణకు కావాలి.
అభివృద్ధి ఎలా ఉంటుందో ఇప్పుడు కండ్ల ముందు కనిపిస్తున్నది. సంక్షేమ పథకం అంటే ఏమిటో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం అనుభవపూర్వకంగా తెలుసుకున్నది. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో పని చేస్తూ, ప్రపంచం నలుమూలల నుంచి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ర్టానికి రప్పిస్తున్న ‘తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్’ను ఎలా విస్మరిస్తారు? కేసీఆరే ఆదర్శంగా రాష్ట్రం, రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ స్థాయుల్లోని నాయకులు, కార్యకర్తలను ఎలా పక్కన పెట్టగలుగుతారు?
అరవై ఏండ్లుగా తెలంగాణ అణచివేతకు కారణమైనవాళ్లు, వారికి వత్తాసు పలికినవాళ్లు ఆ గట్టునున్నారు. తెలంగాణను సాధించి, దశాబ్దాలుగా వివక్షకు గురైన ప్రజానీకం అభివృద్ధి, సంక్షేమం కోసం అనుక్షణం తపించే గుండె ఈ గట్టున ఉంది. ఏ గట్టున ఉండాలో.. చాయిస్ మనదే.
…?చిమ్మని మనోహర్