హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): వచ్చే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 8 సీట్లను బీసీలకు కేటాయించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీని ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఉదయపూర్ డిక్లరేషన్కు అనుగుణంగా మెజార్టీ సీట్లను బీసీలకు కేటాయించి వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరా రు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పదవులన్నీ ఒకే సామాజికవర్గానికి కేటాయించడం ద్వా రా సబ్బండ వర్ణాలను నిరుత్సాహానికి గురిచేసిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 22 సీట్లను మాత్రమే కేటాయించి ఉదయపూర్ డిక్లరేషన్కు తిలోదకాలిచ్చిందని గుర్తుచేశారు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన 37 కార్పొరేషన్లలో బీసీలకు 13 మాత్ర మే ఇచ్చిందని అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రజా, ఉద్యమ నాయకులకు నామినేటెడ్ పదవుల అవకాశాన్నిచ్చి ప్రోత్సహించాలని మున్షీని కోరారు. ఉపకులాలకు సైతం ఫెడరేషన్లను, కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని, బీసీలకు ఎస్టీలకు డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.