హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): సన్నరకం వడ్లు పండించే రైతులకు మాత్రమే బోనస్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనని మాటను అన్నట్టుగా బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారం చేస్తున్నదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బీ మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. రైతుల పేరిట ధర్నాలు చేసింది రైతులు కాదని, బీఆర్ఎస్ కార్యకర్తలని ఆరోపించారు. హైదరాబాద్ గాంధీభవన్లో గురువారం మాజీ మేయర్ బొంతు రాంమోహన్, పీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్రెడ్డి రైతులకు త్వరలో తీపికబురు చెప్పనున్నారని తెలిపారు. గత ప్రభుత్వం కంటే తాము ఎక్కువ సంఖ్యలో ఐకేపీ సెంటర్లు తెరిచి, ఎక్కువ ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు తమ ప్రభుత్వ నాలుగు నెలల పాలనలో సంతోషంగా ఉన్నారని చెప్పారు. కేంద్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏమైనా చేసిందని అని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో తాను కూడా ఉన్నట్టు మహేశ్కుమార్గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్కే వస్తాయని చెప్పారు.