జగిత్యాల, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ధరణిలో కొన్ని లోపాలున్నా ఆ పోర్టల్ను పూర్తిగా రద్దుచేయాల్సిన అవసరం లేదని, లోపాలను సరిదిద్ది ధరణిని కొనసాగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి అన్నారు. పాలనాపరంగా రెవెన్యూశాఖ కీలకమైనదని.. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడంతో గ్రామస్థాయిలో పాలన లేకుండా పోయిందని తెలిపారు. సర్వీసు రెగ్యులరైజేషన్ విధానంతో ఇతర శాఖలకు సర్దుబాటు చేసిన వీఆర్వోలు, వీఆర్ఏలను తిరిగి మాతృ వ్యవస్థలోకి తీసుకొచ్చే విషయమై సీఎంతో మాట్లాడుతానని చెప్పారు. ధరణి అనేది యాజమాన్య హక్కులను చూపించే పత్రం మాత్రమేనని, అదే వేదం కాదని పేర్కొన్నారు. ధరణి రికార్డుల్లో ఉన్న లోపాలను సవరించి తగిన మార్పు చేయాలని చెప్పారు. జగిత్యాలలో బుధవారం రెవెన్యూ అధికారులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ ధరణి రికార్డుల్లో పొరపాట్లు జరిగితే లోపాలను సరిచేసే అధికారం ప్రభుత్వానికి, అధికారులకు ఉండాలని అన్నారు. ధరణిలో మార్పులు చేయడానికి జిల్లాలో రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు, ప్రజలు ధరణి వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను రెవెన్యూ బోర్డుకు తీసుకొస్తే వాటి పరిష్కారానికి తగు నిర్ణయం తీసుకునే విధంగా ఉండాలని అన్నారు. ధరణిలో పొజిషన్, కాస్తుదారు కాలం లేకుండా పోయిందని విమర్శించారు. దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.