హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): అసంతృప్త నేతల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు మర్రి శశిధర్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదంతాలను ఉదాహరణగా చూపుతున్నారు. బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిశారని, పార్టీపై విమర్శలు చేశారని పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డిపై ఆగమేఘాలపై చర్యలు తీసుకున్న అధిష్ఠానం అదే పని చేసిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై మాత్రం చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నదని పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా మూడు నెలల క్రితం అమిత్షాను కలిశారు. ఆయన పలుమార్లు పీసీసీ అధ్యక్షుడిని తిట్టిపోశారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సొంత పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీచేస్తున్న తమ్ముడికి ఓటు వేయాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులను కోరిన ఆడియో వైరల్ అయింది. దీనిపై అధిష్ఠానం ఆయనకు నోటీసులు జారీచేసి చేతులు దులుపుకుంది. ఇంతకుముందు వెంకటరెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ను డబ్బులకు అమ్ముడుపోయాడని ఆరోపించారు. కాంగ్రెస్లోనే ఉంటూ పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు భయపడుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై విమర్శనాస్ర్తాలు సంధించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి అస్సలు బాగాలేదని, ఉన్న పది మంది కూడా గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదని చెప్పారు. సీనియర్ నేత శశిధర్రెడ్డి వెళ్లిపోతే పార్టీకి చాలా నష్టమని అన్నారు. పార్టీ నేతలంతా వెళ్లిపోతుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నేతలు పార్టీని వీడటానికి ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. అందరూ పార్టీ వీడిన తర్వాత గాంధీ భవన్లో కూర్చొని ఏం చేస్తారని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి పాదయాత్ర ఆలోచనపై విలేకరులు ప్రశ్నించగా.. పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తారా అంటూ ఎద్దేవా చేశారు. ఆయన పాదయాత్ర చేసేది పార్టీ కోసమా..? లేక వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకోవడానికా..? అని ప్రశ్నించారు.