Telangana | గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడా కర్ఫ్యూలు లేవు, అల్లర్లు లేవు. ఇప్పుడు ఎన్నికల వేళ కాంగ్రెస్ రాజకీయ దురాశకు రాష్ట్రం మళ్లీ ఉమ్మడి రాష్ర్టాన్ని తలపిస్తున్నది. వరుస కత్తి దాడులతో రక్తపు మరకలు అంటుతున్నాయి. ఎక్కడో ఒకటి జరిగిందంటే అనుకోకుండా జరిగిందని అనుకోవచ్చు. కానీ రోజుల వ్యవధిలోనే ఆరుగురుకి కత్తిపోట్లు పడ్డాయంటే ఇది పక్కా కుట్ర అని స్పష్టమవుతున్నది. ఇలాంటి కుట్రలు, రక్తపాతాలు కాంగ్రెస్ పార్టీకి కొత్తేమి కాదు.
సొంత పార్టీ సీఎంను కుర్చీ నుంచి దించేందుకు హైదరాబాద్లో రక్తపాతానికి తెగబడ్డ హీనమైన చరిత్ర కాంగ్రెస్ది ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 1990లో హైదరాబాద్లో జరిగిన మతకల్లోలాల వెనుక తమ పార్టీకి చెందిన కొందరి హస్తం ఉన్నదని నాటి ఆ పార్టీ సీఎం చెన్నారెడ్డే స్వయంగా చెప్పటం ఆ పార్టీ రక్తదాహానికి నిదర్శనం. ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనలను రాష్ట్రంలో పునరావృతం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నది.
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ తన మార్క్ రక్తపాత రాజకీయాన్ని మొదలుపెట్టింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల్లో హింసను ప్రోత్సహిస్తున్నది. బీఆర్ఎస్ నేతలపై, కార్యకర్తలపై కత్తి దాడులకు తెగబడుతున్నది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరు కత్తి దాడి ఘటనలకు కాంగ్రెస్ ఒడిగట్టింది. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడితో రక్తపాతాన్ని మొదలుపెట్టిన హస్తం పార్టీ.. ఆ దాడుల పరంపరను కొనసాగిస్తున్నది. బుధవారం ఒక్కరోజే మంథని, నకిరేకల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు కత్తులతో దాడులు చేశారు. కాంగ్రెస్ నేతల దాడుల ఘటనలను పరిశీలిస్తే.. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై కత్తి దాడి జరిగింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు హైమద్, రజాక్, జావెద్పై కాంగ్రెస్ నేత భీమ్దాస్ కత్తిపోట్లతో తెగబడ్డారు. మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత బక్కరావ్ బీఆర్ఎస్ నేత రాజిరెడ్డిపై కత్తితో దాడి చేశారు. అంతేకాదు సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమధును కూడా హెచ్చరించారు. నకిరేకల్ నియోజకవర్గంలో సురేశ్ అనే బీఆర్ఎస్ కార్యకర్తపై వేముల వీరేశం అనుచరులు కత్తితో దాడికి దిగారు. అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాల్రాజ్పైనా దాడికి దిగారు. కొల్లాపూర్లో స్వతంత్య్ర అభ్యర్థి శిరీష(బర్రెలక్క), ఆమె తమ్ముడిపైనా దాడిచేశారు.
ఇప్పటి వరకు జరిగిన ఏ సంఘటనా యాదృచ్ఛికంగా జరిగింది కాదని, పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్టు స్పష్టం అవుతున్నది. అంటే.. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో కత్తులు వెంటబెట్టుకొని తిరుగుతున్నారని తేలిపోయింది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది. దీన్ని తట్టుకోలేక ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంయమనం కోల్పోతున్నారు. అందుకే ప్రత్యర్థులపై దాడులకు దిగుతూ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు, ఓటర్లను తమ దారికి తెచ్చుకొనేందుకు ఇలా దాడులకు తెగబడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు చేసిన దాడులు శాంపిల్ మాత్రమేనని, ఇక ముందు ఇలాంటివి చాలానే జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే తెలంగాణ రావణ కాష్టంగా మారటం ఖాయమనే అందోళనలు వ్యక్తమవుతున్నాయి. కుట్రలు, కత్తులు, రక్తపు మరకలతో సావాసం చేసే కాంగ్రెస్ను ఆదరిస్తే ఆధోగతి తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆ పార్టీ రాష్ర్టానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా తమకు కాంగ్రెస్సే కావాలనుకుంటే జరగబోయే ప్రమాదాలను తట్టుకొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.