Mynampally Hanumantha Rao | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 25 (నమస్తే తెలంగాణ): మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ కండువా కప్పుకోకముందే ఆ పార్టీలో కిరికిరి మొదలైంది. ఆయన కోసం ఎన్నో ఎండ్లుగా పార్టీని నమ్ముకున్న బీసీ నేతను బలి చేస్తారా? అని ఆ వర్గం అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మల్కాజిగిరి టికెట్ తనదేనని మైనంపల్లి ప్రకటించుకోగా, ఎట్టి పరిస్థితుల్లో పోటీలో తానే ఉంటానని మేడ్చల్-మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ చెప్పడం, దానికి పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ మద్దతు పలకడంతో పార్టీలో కాకరేగింది. నందికంటి శ్రీధర్ 2014 ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. 2018లో పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితికి కేటాయించడంతో టికెట్ దక్కలేదు.
ఈసారి మల్కాజిగిరి టికెట్ తనకే వస్తుందని శ్రీధర్, ఆయన వర్గీయులు ధీమాగా ఉన్నారు. బీసీలకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న బీసీ నేతల్లో శ్రీధర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూపొందించిన జాబితాలో రెండో పేరు గా మల్కాజిగిరి స్థానం నుంచి నందికంటి పేరు ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఎపిసోడ్ పార్టీలో చిచ్చు పెట్టింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, అంజనీకుమార్యాదవ్ సోమవారం మైనంపల్లి నివాసానికి వెళ్లి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి టికెట్ తనకే వస్తుందని మైనంపల్లితోపాటు ఆయన అనుచరులు బహిరంగంగా ప్రకటించడంతో ఒక్కసారిగా లొల్లి మొదలైంది.
దూలపల్లిలో మైనంపల్లి నివాసానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు వచ్చి ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తున్న సమయంలోనే మధుయాష్కీతోపాటు, నందికంటి శ్రీధర్, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అల్టిమేటం జారీచేశారు. సీఎల్పీ నేత భట్టి, మధుయాష్కీ ముందుగా నందికంటి శ్రీధర్ ఇంటి కి వెళ్లి, ఆ తర్వాతనే మైనంపల్లి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మీడియాతో మాట్లాడుతూ.. మైనంపల్లి కాంగ్రెస్లోకి రావడాన్ని ఆహ్వానిస్తూనే, ఆయన కోసం పార్టీని నమ్ముకున్న బీసీ నేతను బలి చేయలేమని చెప్పుకొచ్చారు. నందికంటి శ్రీధర్ కూడా ఘాటుగానే స్పందించారు. మైనంపల్లి తనకు, తన కుమారుడికి టికెట్ ఖరారైనట్టుగా చేసుకుంటున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. బీసీ నేతలకు టికెట్లు ఇవ్వాలనే డిమాండ్ కొనసాగుతుండగా జాబితాలో రెండో పేరుగా ఉన్న తనకు టికెట్ ఎలా రాదని ప్రశ్నించారు. కచ్చితంగా మల్కాజిగిరి బరిలో ఉంటానని, టికెట్ రాకపోతే అప్పుడు తన కార్యాచరణ ప్రకటిస్తానని పరోక్షంగా అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేయడంతో మల్కాజిగిరి కాంగ్రెస్లో గందరగోళం నెలకొన్నది.