హైదరాబాద్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీరు మారడం లేదు. మారే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. నేతల మధ్య కొట్లాటలు, తన్నులాటలతో టికెట్ల పంచాయితీ తారస్థాయికి చేరింది. అసంతృప్త నేతల ధర్నాలు, నిరసనలతో గాంధీభవన్ దద్దరిల్లింది. టికెట్లు దక్కని నేతలు భగ్గుమంటున్నారు. ధర్నాలు, నిరసనలతో అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పలుచోట్ల ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. టికెట్లు దక్కని నేతలు, వారి అనుచరులు గాంధీభవన్పై దండయాత్ర చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పటాన్చెరు, వనపర్తి, నారాయణఖేడ్, బోథ్, నర్సాపూర్ నేతలు తమ నియోజకవర్గాల్లో ఆందోళన నిర్వహించారు.
టికెట్ ఆశించి భంగపడిన నేతల అనుచరుల ఆందోళనలతో గాంధీభవన్ దద్దరిల్లింది. బెల్లయ్యనాయక్, చిన్నారెడ్డి, కాట శ్రీనివాస్గౌడ్ అనుచరులు గాంధీభవన్లో నిరసనకు దిగారు. ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నారాయణఖేడ్ టికెట్ను సురేశ్ షెట్కార్కు కేటాయించడంపై సంజీవరెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోథ్లో ఇప్పటికే ప్రకటించిన వెన్నెల అశోక్ను మార్చి కొత్త అభ్యర్థి అదె గజేందర్కు టికెట్ ఇవ్వడంతో అశోక్ వర్గీయులు బోథ్లో రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
సీనియర్ నేత చిన్నారెడ్డికి తొలుత టికెట్ కేటాయించి తిరిగి రద్దు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు వనపర్తి టికెట్ కేటాయించిన అధిష్ఠానం ఆ తర్వాత దానిని మెగారెడ్డికి కేటాయించింది. మంగళవారం ముభావంగానే గాంధీభవన్కు వచ్చిన ఆయన అక్కడ తన అనుచరులతో సమావేశమయ్యారు. జరిగిన అవమానాన్ని కార్యకర్తలతో పంచుకొని బాధపడ్డారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆగ్రహించిన అనుచరులు గాంధీభవన్లోనే ధర్నాకు దిగారు.
టికెట్ల కేటాయింపులో తమకు జరిగిన అన్యాయంపై అసలు కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా తమ నిరసనగళాన్ని విప్పుతున్నారు. ఈ క్రమంలో కొందరు రాజీనామాలు చేస్తుంటే మరికొందరు రెబల్గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. టికెట్ల ప్రకంపనలతో ఆదిలాబాద్లో కాంగ్రెస్ మొత్తం ఖాళీ అయింది. డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్ సహా నేతలంతా పార్టీకి రాజీనామా చేశారు. పటాన్చెరువు టికెట్ ఆశించిన కాట శ్రీనివాస్గౌడ్, సత్తుపల్లి టికెట్ ఆశించిన మానవతారాయ్, కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడిన ఎడవల్లి కృష్ణ కాంగ్రెస్పై రెబల్గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
భైంసా: నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ను నారాయణరావు పటేల్కు కేటాయించడంపై మరోనేత డాక్టర్ కిరణ్కుమార్ కొమ్రెవార్ వర్గంలో అగ్రహం వ్యక్తమైంది. మంగళవారం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయన అనుచరులు కాంగ్రెస్ జెండాలను తగలబెట్టారు. ప్లెక్సీలను చించివేశారు.
కల్లూరు: సత్తుపల్లి టికెట్ను సీనియర్ నేత సంభాని చంద్రశేఖర్కు కాకుండా కొత్తగా చేరిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంభాని వర్గీయులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం రామకృష్ణాపురంలో వారు సమావేశమయ్యారు. సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వేంసూరు మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని రావులపల్లిలో మంగళవారం రాత్రి ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులతో కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. విషయం తెలిసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, మంత్రి మహేంద ర్రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకుని ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.
కరీంనగర్ టికెట్ను పురమల్ల శ్రీనివాస్కు కేటాయించడంతో మంగళవారం కరీంనగర్లోని డీసీసీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. అనేక భూదందాలు, భూ ఆక్రమణ కేసుల్లో నిందితుడిగా ఉన్న బొమ్మకల్ సర్పంచ్ పురమల్లకు టికెట్ ఎలా కేటాయిస్తారని నిలదీశారు. ఆయనపై 24కు పైగా భూకబ్జా కేసులు ఉన్నాయని గుర్తు చేశారు.
బంజారాహిల్స్: పార్టీ కోసం ఏండ్ల తరబడి కష్టపడుతున్న కాటం శ్రీనివాస్గౌడ్కు కాకుండా పార్టీ సభ్యత్వం కూడా లేని నీలం ముదిరాజ్కు పటాన్చెరువు టికెట్ ఎలా ఇస్తారంటూ మంగళవారం వందలాదిమంది కార్యకర్తలు రేవంత్రెడ్డి నివాసం ముట్టడికి యత్నించారు. రేవంత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రూ. 100కోట్లకు నీలం ముదిరాజ్కు టికెట్ అమ్ముకున్నాడంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్రెడ్డి ఇంటివద్దకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని పోలీస్స్టేషన్కు తరలించారు.
తనకు టికెట్ దక్కకపోవడంపై ఆ పార్టీ సీనియర్ నేత బెల్లయ్య నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు మూడు చోట్ల టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆయనకు ఎక్కడా టికెట్ ఇవ్వలేదు. సోమవారం గాంధీభవన్కు వచ్చిన ఆయన ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ టికెట్ తనకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి ఎలాగూ కామారెడ్డికి వెళ్లారని, ఆయనకు రెండు సీట్లు ఎందుకని ప్రశ్నించారు. గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.