హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ‘కష్టపడి జనాన్ని పోగు చేశాం.. అయినా మమ్మల్ని వేదికపైకి పిలవకుండా అవమానించారు. మీ సోకు మీ కేనా?’ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్లో టీపీసీసీ విసృత స్థాయి సమావేశం జరిగింది. వరంగల్ సభలో రాహుల్గాంధీ సభా వేదికపైకి తమను వేదికపైకి పిలవకుండా అవమానించారని సమావేశంలో డీసీసీ అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎంతో కష్టపడి జన సమీకరణ చేస్తే, ఆ క్రెడిట్ తమకు దక్కకుండా టీపీసీసీ కొట్టేసిందని మండిపడ్డారు. డీసీసీ అధ్యక్షులు లేకుండా పార్టీ కార్యక్రమాలు ఎలా అమలవుతాయని నిలదీశారు.
క్షేత్రస్థాయిలో పార్టీని బతికించేది తామేనన్న విషయాన్ని విస్మరించవద్దని హితవు పలికారు. తమకు జరిగిన అవమానంపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్నట్టు డీసీసీ అధ్యక్షులు ప్రకటించారు. మొదట ఈ విషయంపై టీపీసీసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని డీసీసీ అధ్యక్షులు తెలుపగా, తమను అవమానపరిచిందే టీపీసీసీ అయినప్పుడు తిరిగి దానికే ఫిర్యాదు చేయటం వల్ల ప్రయోజనమేమిటని కొం దరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ అంశాన్ని ఏకంగా ఏఐసీసీ దృష్టికే తీసుకెళ్లాలని నిర్ణయించారు. కాగా, డీసీసీ అధ్యక్షుల అసంతృప్తికి టీపీసీసీ అధ్యక్షుడి తాజా నిర్ణయం మరింత ఆగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. డీసీసీ అదాయ, వ్యయాలపై తనకు నివేదిక ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆదేశించటంపై మరింత అసంతృప్తి వ్యక్తమైంది.