రేవంత్కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మేడిగడ్డను రిపేర్ చేసి పంటలకు నీళ్లివ్వాలి. డిసెంబర్ 3న కేసీఆర్ సీఎం అయ్యుంటే దేశంలోని కాంట్రాక్టర్లందరితో మాట్లాడి మేడిగడ్డను బాగు చేయించి ఉమ్మడి జిల్లాలోని 13 మండలాలకు సాగు, తాగునీరందించేవారు.
-కేటీఆర్
KTR | రాజన్న సిరిసిల్ల, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వాన్ని నడపరాక, చేతకాక, పంటలకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ఇచ్చేందుకు ఇష్టం లేకపోవటం వల్లే పంటలెండుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారకరామారావు అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు అసలే కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలకేంద్రాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కరెంటు కష్టాలు, ఎరువుల గోస, తాగునీటికి తండ్లాటతో ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. కరువొచ్చి నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని సీఎం దొంగ మాటలు మాట్లాడుతున్నారని, గత వానకాలంలో రాష్ట్రంలో 14 శాతం అధిక వర్షపాతం నమోదైందని గుర్తుచేశారు. తరుముకొస్తున్న కరువుతో పంటలు ఎండిపోయి, నెర్రెలు వారుతున్న భూములతో రైతులు అరిగోస పడుతున్నారని, కేసీఆర్ ఉంటే గోసయ్యేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం కొట్టుకుపోయిందని, కేసీఆర్ రూ.లక్ష కోట్లు కరాబ్ చేసిండంటూ దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం అంటే కాంగ్రెసోళ్లకు తెలిసింది సున్నా అని ఎద్దేవా చేశారు. రేవంత్కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మేడిగడ్డను రిపేరు చేసి పంటలకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 3న కేసీఆర్ సీఎం అయ్యుంటే దేశంలోని కాంట్రాక్టర్లందరితో మాట్లాడి మేడిగడ్డను బాగు చేయించి ఉమ్మడి జిల్లాలోని 13 మండలాలకు సాగు, తాగునీరందించే వారని తెలిపారు. మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చానని రేవంత్ చెప్పుకుంటున్నాడని ధ్వజమెత్తారు. ‘పెండ్లికాకముందే.. సంసారం చెయ్యకముందే పిల్లలు పుడతారా? వచ్చి మూడు నెలలే అయ్యింది. ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలేదు. కేసీఆర్ ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చుకుంటూ ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకునేందుకు సిగ్గు, ఇజ్జత్ అనిపించటం లేదా? అని సీఎంపై మండిపడ్డారు. తెలంగాణను దొంగోడి చేతిలో పెట్టామని, పిచ్చోడి చేతిలో రాయిలా గుంపు మేస్త్రీ పనితీరు ఉన్నదని వ్యాఖ్యానించారు. ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారని, మోసపు మాటలే నమ్ముతారని రేవంత్రెడ్డి ముందే చెప్పారని అన్నారు.
తెలంగాణ గళం, బలం కేసీఆరేనని కేటీఆర్ తేల్చి చెప్పారు. ‘ప్రభుత్వంపై కొట్లాడాలంటే మీ దీవెన ఉండాలి. ప్రతి గులాబీ సైనికుడు తానే అభ్యర్థినని, కేసీఆర్ తననే పంపించాడని భావించి 15 రోజులు బాగా కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. కల్లబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, 420 హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ను గల్లా పట్టి అడగాలి. ప్రజాక్షేత్రంలో నిలబెట్టి నిలదీయాలి. మనం ప్రశ్నించకపోతే ఐదేండ్లు ప్రజలను మోసం చేసుకుంటూ పోతారు. కాంగ్రెస్ నేతల దొంగ ప్రచారాలను నిలదీయాలి’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంటులో ప్రశ్నించే గొంతుక ఉండాలంటే బీఆర్ఎస్ జెండా ఎగరాలని, అందుకు పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. భాష రానోడిని ఎంపీగా గెలిపించుకుంటే దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నాడంటూ బండి సంజయ్పై ఫైర్ అయ్యారు. పార్లమెంటులో పనులు చెయ్యాల్సింది పోయి దేశం, ధర్మం అంటూ గాల్లో తిరుగుతున్నారని ఆరోపించారు.
ఈ నెల 12న ఎస్ఆర్ఆర్ కళాశాలలో నిర్వహించే బీఆర్ఎస్ కదనభేరీని విజయవంతం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘మీ అన్నగా మిమ్మల్ని గెలిపించే బాధ్యతను నేను తీసుకుంటా’ అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ప్రతి గ్రామంలో పర్యటిస్తానని వెల్లడించారు. సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండలాధ్యక్షులు వర్ష కృష్ణహరి, ఎండ్ల సాగర్, చీటి నర్సింగరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.