సూర్యాపేట : వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలు అంటూ ఆ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్లో పెను దుమారం సృష్టిస్తున్నది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ నిరంతరం ఉండాలన్నా బీఆర్ఎస్ నిర్ణయంతో ఏకీభవిస్తున్న సీనియర్లు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి కారెక్కుతున్నారు. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించిన మూడు గంటల విద్యుత్ ప్రకటనను బహిరంగంగా విబేధించిన సీనియర్ కాంగ్రెస్ నేత గోపగాని వేణుధర్ ఏకంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు బుధవారం సాయంత్రం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో జాటోత్ రమేష్, చింత రవి, నాగభూషణా చారి, ఎల్లయ్య, చిన వెంకన్న, శ్రీను తదితరులు బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ రైతు వ్యతిరేక పార్టీని బొంద పెట్టాలన్నారు. మూడు గంటలు కాదు మూడు పంటలు కావాలన్న బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు.