హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయి. రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో పాల్వాయి స్రవంతిని నిలిపినప్పటికీ ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి పరోక్షంగా మద్దతిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలో పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండటంపై పెద్ద చర్చే జరుగుతున్నది. ఇప్పటివరకు ఆయన మునుగోడులో అడుగుపెట్టింది లేదు.. పార్టీ తరఫున ప్రచారం చేసిందీలేదు. పైగా ఈ నెల 15న ఆయన కుటుంబ సమేతంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నట్టు సమాచారం. స్థానబలం ఉండి.. పార్టీలో కీలక నేత అయిన వెంకట్రెడ్డి ప్రచారం కాంగ్రెస్కు కలిసొచ్చే అంశం. అయినా ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు. విచిత్రమేమంటే పార్టీ పెద్దలు కూడా వెంకట్రెడ్డి విషయంలో అంటీముట్టనట్టు ఉంటున్నారు. ఆయన వ్యవహారశైలిపై పార్టీ అధిష్ఠానం ఒక్క మాట కూడా మాట్లాడటంలేదు. ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం.
రేవంత్పై నేతల ఆగ్రహం
మునుగోడులో కాంగ్రెస్ ప్రచార తీరుపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేవంత్రెడ్డి వన్మ్యాన్ షోపై ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి ప్రాధాన్యమివ్వటంలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నేతలను ప్రచారంలో కలుపుకోకపోవడంపై సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. బీజేపీతో కుమ్మక్కు రాజకీయం చేస్తున్నారేమోననే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇదే జరిగితే హుజూరాబాద్ మాదిరిగానే మునుగోడులోనూ కాంగ్రెస్ పార్టీ మునగడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలతో కల్లోలం
రాహుల్గాంధీ జోడో యాత్ర రాష్ట్రం లో కొనసాగుతున్న సమయంలోనే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు పార్టీ నుంచి జంప్ అవుతారని మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కల్లోలం రేపాయి. ఓవైపు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మరోవైపు ఉత్తమ్ కుమార్రెడ్డి నేను కాదంటే నేను కాదంటూ భుజాలు తడుముకొంటున్నారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం చాలా రోజుల నుంచే జరుగుతున్నది. పలు సందర్భాల్లో ఆయన కూడా నర్మగర్భంగా చెప్తున్నారు.