అచ్చంపేటరూరల్, జూన్ 18: ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే కేటాయిస్తున్నారు. దీంతో అర్హులైన నిరుపేదలకు అన్యాయానికి గురవుతుండగా, కొందరు అధికార పార్టీ నేతలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని నమ్మబలికి అందినకాడికి దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని గోకుల్నగర్ ఉట్ల కోనేరుకు చెందిన ఎన్ శిల్ప 16వ వార్డులో పాడుపడిన ఇంటిలో జీవనం సాగిస్తున్నది.
ఎమ్మెల్యే అనుచరుడు, స్థానిక కాంగ్రెస్ నేత నల్లపు శ్రీనివాసులు నీకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని, అందుకు రూ.50వేలు ఖర్చు అవుతుందని తీసుకున్నాడు. అయితే ఇందిరమ్మ ఇల్లు వస్తుందనే భ్రమలో ఆమె ఉన్న పాత ఇంటిని కూల్చింది. తీరా మొదటి విడతలో ఆమెకు ఇల్లు మంజూరు కాకపోవడంతో ఖాళీ స్థలంలో రేకులషెడ్డు వేసుకొని జీవనం సాగిస్తున్నది. ఇల్లు ఇప్పించమని సదరు కాంగ్రెస్ నాయకుడి అడిగితే ముఖం చాటేస్తున్నాడని ఆరోపించింది. ఉన్నతాధికారులైనా స్పందించి తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని వేడుకున్నది.