హైదరాబాద్, జనవరి 16(నమస్తే తెలంగాణ): నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ నేతలు మరికొంతకాలం ఎదురుచూడక తప్పేటట్టులేదు. సంక్రాంతి పండుగ లోపు పదవులు భర్తీ చేస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చినప్పటికీ వారికి నిరాశే మిగిలింది. సంక్రాంతి వచ్చి వెళ్లినా పదువులు మాత్రం రాకపోవడంతో ఆశావహులందరూ నిరాశలో కూరుకుపోయారు. రాష్ట్రంలో పదేండ్ల తర్వాత కాంగ్రెస్కు అధికారం దక్కడంతో పదవుల కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలై ఉన్నారు.
తాజాగా, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవులకు ఇద్దరి పేర్లు ఖరారు కావడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో అధిష్ఠానంపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు పోస్టుల భర్తీ ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రేవంత్ 21న రాష్ర్టానికి చేరుకుంటారు. ఆ వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో బిజీగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీ అనుమానమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.