పెద్దపల్లి, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ)/ధర్మారం/పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలో కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న ‘హాథ్ సే హాథ్ జోడో పీపుల్స్ మార్చ్’ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు మంగళవారం తన్ను కున్నారు. భట్టి కండ్లముందే ఈ తతంగం జరిగింది. ఒకరినొకరు కర్రలతో దాడి చేసుకున్నారు. భట్టి పాదయాత్ర పాలితం మీదుగా పెద్దపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించగానే స్వాగతం పలికేందుకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, ఓదెల జడ్పీటీసీ గంట రాములుయాదవ్ వేర్వేరుగా తమ అనుచరులతో సిద్ధమయ్యారు. ఇద్దరూ ఒకేచోట ఉండాల్సి రావడంతో ‘మేమంటే మేం’ ముందుండాలనే తపనతో అనుచరులంతా తమ నాయకులకు జై కొడుతూ ముందుకు సాగారు.
భట్టి కండ్ల ముందే ఇరువర్గాల నాయకులు బాహాబాహీకి దిగారు. చొక్కాలు పట్టుకుని తోసుకున్నారు. ఘర్షణ పడుతున్న వారిని భట్టి వారించేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. భట్టి అంగరక్షకుడు ‘ఏం తమాషాగా ఉందా’ అంటూ చేతిలో ఉన్న తుపాకీని చూపుతూ పక్కకు తప్పించడంతో పాదయాత్ర ముందుకు సాగింది. సాయంత్రం పెద్దపల్లి జిల్లాలోని బొంపల్లి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు వేర్వేరు గ్రూపులు గా ఏర్పడి ఒకవైపు విజయరమణారావు, మరోవైపు గంట రాములుకు అనుకూలంగా నినాదాలు చేయ డం ప్రారంభించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇరువురు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో గంట రాములు వర్గీయుడు నర్సింగ్ తల పగిలింది. మరికొందరికి గాయాలయ్యాయి. అనంతరం గంట రాములు వర్గీయులు నిరసనకు దిగారు. విజయ రమణారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ధర్మారం మండలం రచ్చపల్లిలో ధర్మపురి కాంగ్రెస్ టికెట్ను ఆశిస్తున్న జడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నాయకులు మద్దెల రవీందర్, గజ్జెల స్వామి వేర్వేరు గ్రూపులుగా ఏర్పడి భట్టికి స్వాగతం పలికేందుకు రావడం రసాభాసగా మారింది. ఈ సందర్భంగా నాయకుల మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.