మిడ్జిల్, నవంబర్ 15: బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేసిన ఘటన బుధవారం మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో చోటుచేసుకున్నది. కొంతమంది యువకులు పాలమూరు యూనివర్సిటీ విద్యార్థుల (నిరుద్యోగులు) ముసుగులో సీఎం కేసీఆర్కు ఓటు వేయొద్దని కరపత్రాలు పంచుతున్నారు. దీనిని గమనించిన బీఆర్ఎస్ యువ నేతలు అడ్డుకుని విచారించగా.. వాళ్లు అసలు యూనివర్సిటీ విద్యార్థులు కాదని తేలింది. కాంగ్రెస్ నాయకులు తప్పుడు కరపత్రాలు ముద్రించి కొంతమంది యువకులకు కూలి డబ్బులు చెల్లించి బీఆర్ఎస్పై అసత్య ప్రచారాలు చేయిస్తున్నట్టు గుర్తించారు. వారి నుంచి కరపత్రాలను స్వాధీనం చేసుకుంటుండగా.. తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురితో మాట్లాడి సమస్య పెద్దది కాకుండా చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు సుధాబాల్రెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు జంగిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.