ములుగు, మార్చి 30 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ నాయకుడిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ములుగు జిల్లా ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ‘గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు శానబోయిన అశోక్ వ్యక్తిగత కక్ష పెంచుకుని మూడేండ్లుగా నాతో గొడవ పడుతున్నాడు. బీఆర్ఎస్లో నా ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేకపోతున్నాడు. అధికారుల అనుమతులతో నేను మట్టి వ్యాపారం చేస్తున్నా.. కావాలని చాలా సార్లు నాపై తప్పుడు ఫిర్యాదు చేశాడు. నా అంతు చూస్తానని బెదిరిస్తున్నాడు.
ఈ క్రమంలో శనివారం గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లేందుకు నేను మరో నలుగురితో కలిసి రోడ్డు వద్దకు వచ్చాను. నన్ను చూసిన అశోక్ దుర్భాషలాడుతూ ఇంట్లో నుంచి కత్తిని తీసుకొచ్చి నాపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. రజినీకాంత్, విఘ్నేష్, రాంబాబులు అడ్డుకొని నన్ను కాపాడే ప్రయత్నం చేశారు. అతని చేతిలో ఉన్న వేట కత్తిని తీసుకొని పారేశారు. ఇంతలో ఫంక్షన్లో ఉన్న నా భార్య వసంత బయటకు రాగా.. అశోక్ ఇంటికి వెళ్లి మరో కత్తిని తీసుకొచ్చి నాపై వేటేసేందుకు యత్నించాడు. వసంత అడ్డుకుంటుండగా ఆమె మోచేయిపై కత్తివేటు పడింది. అడ్డుకోబోయిన రాంబాబుకు సైతం గాయాలయ్యాయి.
ప్రాణ రక్షణ నిమిత్తం ములుగు పోలీస్ స్టేషన్లో అశోక్పై ఫిర్యాదు చేశాను’ అని బాధితుడు మామిడి అశోక్ వివరించాడు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా.. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్కు వచ్చాయని, విచారణ చేసి కేసు నమోదు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడి దాడిలో గాయపడి ములుగు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను ములుగు జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పరామర్శించారు. నాగజ్యోతి మాట్లాడుతూ.. ఆదివాసీ మహిళ వసంతపై కత్తితో దాడి చేసి గాయపర్చిన కాంగ్రెస్ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం జిల్లా ఎస్పీతోపాటు డీఎస్పీకి ఫోన్లో విషయాన్ని తెలియజేశారు.