Revanth Reddy | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్లుండి ప్రమాణం చేయనున్నారు. గురువారం ఉదయం 10:28 గంటలకు రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటించారు.
అనుముల రేవంత్ రెడ్డి..1969 ఆగస్టు 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డి పల్లెలో.. దివంగత నరసింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఆరుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన రేవంత్ రెడ్డి… ఇంటర్ ఓ ప్రైవేట్ కాలేజీలో పూర్తి చేశారు. అనంతరం డిగ్రీ చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. ఉస్మానియా అనుబంధ కాలేజీ ఏవీ కాలేజీలో డిగ్రీ(ఫైన్ ఆర్ట్స్) పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలున్న రేవంత్… పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్ ఉన్నారు. దూకుడుగా, చురుకుగా ఉండే రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలపై పోరాడేవారు. ఏబీవీపీ స్టూడెంట్ యూనియన్లో మెంబర్గా చేశారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెయింటర్గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత సోదరుడితో కలిసి ప్రిటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశారు. అది విజయవంతం అవ్వడంతో.. రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించిన ఆయన ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. 1992లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమవివాహం చేసుకున్నారు రేవంత్ రెడ్డి. వీరికి ఒక కుమార్తె ఉన్నారు.
ఆర్ఎస్ఎస్లో పని చేసిన రేవంత్ రెడ్డి.. 2001-02 మధ్య టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేశారు. ఆ తర్వాత 2004లో కల్వకుర్తి టికెట్ ఆశించినా.. కూటమి పొత్తుల్లో భాగంగా ఆ సీటు రేవంత్కు దక్కలేదు. 2006లో జడ్పీటీసీ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇస్తారని భావించినా మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి.. 2008లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అప్పుడే రేవంత్ రెడ్డి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది. ఎమ్మెల్సీగా గెలిచిన రేవంత్ రెడ్డి.. టీడీపీలో చేరారు. టీడీపీలో యాక్టివ్గా పనిచేసిన రేవంత్ రెడ్డికి… చంద్రబాబు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ టికెట్ కేటాయించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా ఓటమి పాలైనా.. రేవంత్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో గెలుపొందిన రేవంత్.. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
అయితే తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులు, టీడీపీలోనే ఉంటే రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగే ఛాన్స్ లేదని భావించిన రేవంత్ రెడ్డి… 2017 అక్టోబర్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచి బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి.. పట్నం నరేందర్ రెడ్డిపై ఓటమి పాలయ్యారు. అయితే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి.. గెలుపొంది మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు.
2015లో తెలంగాణ శాసన మండలి ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలంటూ.. నామినేట్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రేవంత్రెడ్డి లంచం ఇవ్వజూపారంటూ ఒక స్టింగ్-ఆపరేషన్ వీడియోతో సహా ఆరోపణలు రావటంతో ఏసీబీ ఆయన్ను అరెస్టు చేసింది. 45 రోజులకు పైగా జైలు జీవితం గడిపి బెయిల్పై విడుదలయ్యారు. 2017లో టీడీపీకి గుడ్బై చెప్పి.. మరికొందరు టీడీపీ నాయకులతో సహా ఢిల్లీకి వెళ్లి రాహుల్గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.