హైదరాబాద్, సిటీ బ్యూరో/ఖైరతాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నాయా? టీఆర్ఎస్ సర్కారును రాజకీయంగా ఎదుర్కొనలేని ఆ పార్టీలు అల్లర్లకు పూనుకొంటున్నాయా? అంటే తాజాగా చోటుచేసుకొంటున్న పరిణామాలు అలాంటివేనని తెలంగాణవాదులు కుండబద్ధలు కొడుతున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు సృష్టిస్తున్నదని, కాంగ్రెస్ కూడా అదే బాటను ఎంచుకొన్నదని గురువారం నాటి పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నేత రాహుల్ గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చలో రాజ్భవన్కు పిలుపునిచ్చింది. అయితే, ఈ ముసుగులో ఆ పార్టీ రాజధానిలో అల్లర్ల కుట్రకు తెగబడింది. రోడ్లపై వీరంగం సృష్టించటం, ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టడం, ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయటం వంటి చర్యలు కాంగ్రెస్ రౌడీయిజాన్ని బయటపెట్టాయని రాజకీయ పండితులు చెప్తున్నారు.
కాంగ్రెస్ శ్రేణులు కాచిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ మెట్రో బస్సు (ఏపీ 11 జెడ్ 7103) బస్సు అద్దాలు పగలగొట్టి, టైర్లలో గాలి తీసేశాయి. ప్రభుత్వ వాహనం (టీఎస్ 09పీబీ 2966) అద్దాలు పగులగొట్టి విధ్వంసం సృష్టించాయి. ఖైరతాబాద్ చౌరస్తాలో కొన్ని గంటల పాటు సృష్టించిన రణరంగంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఈ చర్యలు ముందస్తు ప్రణాళికేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్తున్నారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే నగరంలోని పలు ప్రాంతాల నుంచి అల్లర్లు సృష్టించే బ్యాచ్ను రంగంలోకి దింపినట్టు సమాచారం. కొంతమంది రాజ్భవన్ వైపు వెళ్తుంటే, ఈ బ్యాచ్ అల్లర్లు సృష్టించటంపైనే ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఏదో జరుగుతున్నదన్న అనుమానాలు రేకెత్తించాలన్న కుట్రలో భాగంగానే కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడ్డట్టు తెలుస్తున్నది.
పోలీసుల సంయమనం
కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయినా పోలీసులు సంయమనం పాటించారు. గల్లా పట్టినా, తోసేసినా సంయమనం కోల్పోకుండా పరిస్థితిని అదుపు చేసేందుకే మొగ్గుచూపారు. ఎలాంటి అనుమతులు లేకుండా పెద్దసంఖ్యలో కార్యకర్తలతో ఖైరతాబాద్ చౌరస్తాలో ఆందోళన చేసి, పోలీసులపై దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కల్గించిన వారిపై పంజాగుట్ట పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్బాబు, మాజీ ఎంపీలు అంజన్కుమార్ యాదవ్, బలరాంనాయక్, మల్లు రవి, వీ హన్మంతరావు, మహిళా అధ్యక్షురాలు సునీతారావు, అన్వేష్ రెడ్డి, మోత రోహిత్ తదితరులపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ‘నన్ను ఆపినవంటే నీ అంతు చూస్తా’ అని హెచ్చరిస్తూ, పంజాగుట్ట మహిళా కానిస్టేబుళ్లపై దాడి చేసి, ఎస్సై ఉపేంద్ర కాలర్ పట్టి దురుసుగా ప్రవర్తించిన రేణుకా చౌదరిపై ఎస్సై ఇచ్చిన ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్లు 143, 145, 147, రెడ్విత్ 149, 152, 153, 353, 506 కింద మరో కేసు నమోదు చేశారు.
ఎస్సై గల్లా పట్టిన రేణుకా చౌదరి
విధ్వంసాన్ని అడ్డుకొన్న పోలీసులపైనా కాంగ్రెస్ నేతలు దౌర్జాన్యానికి దిగారు. ఇష్టారీతిగా దాడులు చేశారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఏకంగా పంజాగుట్ట ఎస్సై గల్లా పట్టుకొని ఈడ్చుకెళ్లడం గమనార్హం. ఎంత మంది వారిస్తున్నా పట్టించుకోకుండా ఎస్సైపై నడిరోడ్డుపై దాడికి దిగారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డీసీపీ జోయల్ డేవిస్ను తోసేశారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ పోలీసులపై కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడ్డారు. రేణుకాచౌదరి చర్యను తెలంగాణ అడ్వొకేట్ కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్సై కాలర్ పట్టుకోవడం అనైతిక చర్య అన్నారు.