హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తుల జాబితా రోజురోజుకు పెరిగిపోతున్నది. తాజాగా ఈ జాబితాలో సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి చేరారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని నడిపిస్తున్నవారే కాంగ్రెస్లో కల్లోలానికి కారణమవుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్.. రేవంత్ ఏజెంట్గా మారిపోయాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీనియర్లను గోడకేసి కొడతా అని అన్నప్పటికీ అధిష్ఠానం కనీసం మందలించలేదని విమర్శించారు. కోమటిరెడ్డి సోదరుల విషయంలో రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదన్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఏఐసీసీ కార్యక్రమాల సమాచారం తనకు ఇవ్వడం లేదని విమర్శించారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని స్పష్టం చేశారు.