గత ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించేదాకా గడ్డమే తీయనని ఉత్తమ్.. తనను కొడంగల్లో ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ప్రకటించారు. వారు చెప్పేవన్నీ బోగస్, బేకార్ ముచ్చట్లే.
– కేటీఆర్
Minister KTR | హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ‘నేను గత 15 రోజులుగా 33 నియోజకవర్గాల్లో పర్యటించాను. మందమర్రి నుంచి వనపర్తి దాకా.. సత్తుపల్లి నుంచి బాన్సువాడ దాకా రాష్ట్రంలో ఏమూల చూసినా కేసీఆరే మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తొమ్మిదిన్నరేండ్లు ప్రభుత్వాన్ని నడిపిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమని ప్రజలు ఫిక్స్ అయ్యారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ నేత, రేవంత్రెడ్డి అనుంగు శిష్యుడు బిల్యా నాయక్ వందలాదిమంది అనుచరులతో బుధవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ సీఎం అయితేనే తమ బతుకులు బాగుంటాయని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.తొమ్మిదిన్నరేండ్లు ప్రభుత్వాన్ని నడిపిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమన్న ఎజెండా స్పష్టంగా కనిపిస్తున్నదని తెలిపారు.
దశాబ్దాలపాటు కొట్లాడినా పరిష్కారం కాని అనేక సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరించారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రంలో 3,146 గిరిజన తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చారని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్లతోపాటు దాదాపు 30 వేల మంది గిరిజన బిడ్డలు ప్రజాప్రతినిధులై తమ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని సగర్వంగా ఎగరవేశారని చెప్పారు. ఎన్నో పోరాటాలు చేసినా పెరగని గిరిజన రిజర్వేషన్లు సీఎం కేసీఆర్ నాయకత్వంలో 6 శాతం నుంచి 10 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు.
‘ఎన్నికలు రాంగనే కాంగ్రెస్ నేతలు కొత్త అంగీలాగు కుట్టించి ఇండ్లకు సున్నాలు వేసుకుంటున్నరు. నేనే సీఎం అని, నేనే మంత్రి అని నానా హంగామా చేసుకుంటున్నరు’ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘ఒకనాడు ఓటుకు నోటు రేవంత్.. ఇయ్యాల సీటుకు రేటు రేవంత్’గా అవతారం ఎత్తారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడందరూ రేవంత్ అనడం లేదని, రేటెంత రేవంత్ అంటున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం మొహం పెట్టుకొని ఓటు అడిగేందుకు వస్తారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘నల్గొండలో ఫ్లోరోసిస్తో లక్షలాది మంది జీవితాలను నాశనం చేసినందుకు ఓటేయాలా? 60 ఏండ్లు అధికారం ఇచ్చినా కరెంట్ ఇయ్యలేదని ఓటు వేయమంటరా? నీళ్లు ఇయ్యలేదు కాబట్టి ఓటేయమంటరా? కేసీఆర్ ఇచ్చిన రైతుబంధును కాపీకొట్టే ప్రయత్నం చేస్తున్నం కాబట్టి ఓటేయమంటరా? 60 ఏండ్లు పాలించినా రైతులకు 24 గంటల కరెంట్ ఇయ్యాల్నన్న ఆలోచన రాని, ఇప్పుడు 48 గంటల ఇస్తాం అని చెప్పి ఓటడుగుతారా?’ అని కాంగ్రెస్ పార్టీపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఓ వైపు కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలు చేస్తుం టే, మరోవైపు బీజేపీ వాళ్లు రోజుకొకరు వచ్చి ఏదేదో మొరిగి పోతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గిరిజన వర్సిటీకి జాగా ఇవ్వలేదని సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్షా అసత్యాలు చెప్పారని మండిపడ్డారు. ఐదేండ్ల కిందటే రాష్ట్ర ప్రభుత్వం 355 ఎకరాల జాగా కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ టాప్ అని అమిత్షా చెప్పారని, ఆయన నిజంగా బాధ్యతగల పదవిలో ఉం టే వెంటనే తెలంగాణకు క్షమాపణ చెప్పాలని డిమాం డ్ చేశారు. అతి తక్కువ ఆత్మహత్యలు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే పార్లమెంటులో చెప్పిందని గుర్తుచేశారు. బీజేపీ వాళ్లు వచ్చి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు బీ టీం అని, కాంగ్రెస్ వాళ్లు బీజేపీకి బీ టీం అని అంటున్నారని, బీఆర్ఎస్కు అలాంటి ఖర్మ పట్టలేదన్నారు. బిల్యానాయక్ బీఆర్ఎస్లో చేరారని, అవతలి పార్టీలకు డిపాజిట్లు గల్లంతయ్యేలా తీర్పు ఇవ్వాలని యువత, నల్లగొండ ప్రజలను కోరారు.
గతంలో ప్రతిపక్షాలు నీళ్లకోసం ధర్నాలు చేసేవి. సీఎం కేసీఆర్ తాగునీరు, సాగునీరు పుష్కలంగా ఇస్తుండడంతో కాంగ్రెస్ సహా విపక్షాలకు పనిలేకుండా పోయింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 4 లక్షల ఎకరాలపైచిలుకు పోడుభూములకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే. కాంగ్రెస్ది భావదారిద్య్రం. ఇప్పుడా పార్టీకి ప్రజలకేం చెప్పాల్నో తెలియడం లేదు.
– మంత్రి కేటీఆర్
దేవరకొండ నియోజకవర్గంలో కొత్తగా 141 తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ప్రశంసించారు. వాటిలో 1,004 మంది సర్పంచులుగా, వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారని చెప్పారు. దేవరకొండ మున్సిపాలిటీగా మారిందని, ఇటీవల రూ. 30-35కోట్లు మంజూరు చేసి అభివృద్ధి చేసుకుంటున్నట్టు తెలిపారు. కొత్తగా మూడు మండలాలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. దేవరకొండ నియోజకవర్గంలో రూ.600 కోట్లతో 5 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, ఏడాదికాలంలో అవి పూర్తి అవుతాయని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్ల్లోరోసిస్ మహమ్మారిని తరిమేసిన ఘనత సీఎం కేసీఆర్ది కాదా? అని ప్రశ్నించారు.
దశాబ్దాలపాటు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్లో పెద్ద పెద్ద నాయకులున్నా, కేసీఆర్ కన్నా ఎత్తుపొడుగు నేతలున్నా సాధ్యం కానిది బక్కపలచని కేసీఆర్ సాధ్యం చేశారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ వన్గా నిలిపిన దార్శనికుడు సీఎం కేసీఆర్ అని కీర్తించారు. రైతుల ఖాతాల్లో రైతుబంధు రూపంలో రూ. 73వేల కోట్ల వేసిన ఘనత సీఎం కేసీఆర్దని, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రైతుబీమా, ఆడపిల్ల పెండ్లికి రూ. 1,00,116.. ఇలా అనేక పథకాలు తెచ్చి జీవితాలు బాగుచేసిన మానవీయ పాలకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్తో మాత్రమే గిరిజనులకు న్యాయం జరుగుతుందని నమ్మి బిల్యానాయక్ బీఆర్ఎస్లో చేరారని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు కాంగ్రెస్ ఇచ్చిన వరాలని, నల్లగొండలో లక్షలాది జీవితాలతో ఆడుకున్న ఫ్లోరైడ్ రక్కసి కూడా కాంగ్రెస్ నిర్వాకమేనని విమర్శించారు. 2014, 2018 ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా సీఎం కేసీఆర్కు తిరుగులేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, ఉప్పల్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, వెంకటేశ్వర్రెడ్డి, శోభన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.