(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి) : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతున్నారా? ఇందుకు బీజేపీ అధిష్ఠానం రంగం సిద్ధంచేసిందా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. రాజగోపాల్రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ ముఖ్యనేత అమిత్షాతో రహస్యంగా సమావేశమైనట్టు బీజేపీలోని ఉన్నత వర్గాల సమాచారం. వారిద్దరూ దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపినట్టు తెలిసింది. ఈ సమావేశానికి జార్ఖండ్లోని గోడా నియోజకవర్గ ఎంపీ నిషికాంత్ దూబే (బీజేపీ) మధ్యవర్తిత్వం వహించారని సమాచారం. ఈ సందర్భంగా రాజగోపాల్రెడ్డిని బీజేపీలో చేరాల్సిందిగా అమిత్షా ఆహ్వానించినట్టు తెలిసింది. దీనికి రాజగోపాల్రెడ్డి సైతం దాదాపు ఓకే చెప్పినట్టు సమాచారం. వ్యాపారవేత్తలైన రాజగోపాల్రెడ్డి, నిషికాంత్ దూబే మధ్య కొన్నేండ్లుగా సాన్నిహిత్యం ఉన్నదని, రాజగోపాల్రెడ్డి జార్ఖండ్లో కాంట్రాక్ట్లు చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ స్నేహంతోనే ఈ భేటీకి దూబే మధ్యవర్తిత్వం వహించారని తెలుస్తున్నది.
కేసీఆర్ను నిలువరించేందుకేనా..!
వరుస ఉప ఎన్నికలు తేవడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ను రాష్ట్ర రాజకీయాల్లోనే తలమునకలయ్యేలా ఎంగేజ్ చేయాలని బీజేపీ ఎత్తుగడ అని ఆ పార్టీ వర్గాల సమాచారం. కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా నిలువరించడంతోపాటు ప్రత్యామ్నాయ ఎజెండా ద్వారా విపక్షాలను సమీకరించే ప్రయత్నాలను అడ్డుకోవాలనేది అమిత్షా వ్యూహమని వారంటున్నారు. ఇందులో భాగంగా రేవంత్రెడ్డికి, రాజగోపాల్రెడ్డికి మధ్యనున్న విభేదాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని అమిత్షా భావిస్తున్నారని తెలంగాణ రాజకీయాలను నిరంతరం సునిశితంగా పరిశీలించే ఢిల్లీ పాత్రికేయుడొకరు వ్యాఖ్యానించారు. రాజగోపాల్రెడ్డి కొన్నాళ్లుగా కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. రేవంత్రెడ్డిపై రాజగోపాల్రెడ్డి అనేకసార్లు బహిరంగంగానే విమర్శలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నల్లగొండ జిల్లాలో రేవంత్రెడ్డి సభ పెట్టకుండా ప్రయత్నించడం వంటి పరిణామాల నేపథ్యంలో తాను కాంగ్రెస్ను వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాజగోపాల్రెడ్డి సంకేతాలిచ్చినట్టు తెలిసింది. దీనిని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నది. రాజగోపాల్రెడ్డిని అడ్డం పెట్టుకొని కేసీఆర్ను రాష్ట్ర రాజకీయాలకు పరిమితం చేసేలా అమిత్షా వ్యూహం పన్నినట్టు సమాచారం. మోదీ వైఫల్యాలను, బీజేపీ చేసిన తప్పులను సీఎం కేసీఆర్ ఎత్తిచూపుతుండటం, ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుండటంతో బీజేపీ పెద్దలు తలలు పట్టుకొంటున్నారని.. ఈ దశలో నాలుగైదు నెలలు కేసీఆర్ను రాష్ట్రంలోనే ఎంగేజ్ అయ్యేలా చూడాలని బీజేపీ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
త్వరలోనే ఉప ఎన్నిక.. తప్పకుండా గెలిపిస్తా..!
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని వీలైనంత త్వరగా రాజీనామా చేయించడం ద్వారా తెలంగాణలో మరో ఉప ఎన్నిక తీసుకొని రావాలనేది అమిత్షా వ్యూహమని ఢిల్లీలోని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ ఎత్తుగడలో భాగంగానే మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఆగస్టు 30 లోగా రాజీనామా చేయాలని రాజగోపాల్కు అమిత్షా సూచించినట్టు తెలిసింది. మూడు నాలుగు నెలల వ్యవధిలోనే అంటే.. నవంబర్లోగానే ఉప ఎన్నిక వచ్చేలా చేస్తామని.. ఆ ఎన్నికలో తిరిగి గెలిపించే బాధ్యత తనదని అమిత్షా హామీ ఇచ్చినట్టు ఆ పార్టీ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం అందింది. ఈ ఏడాది చివర్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఉపఎన్నిక నిర్వహించే అవకాశం ఉంటుందని చెప్పినట్టు సమాచారం. మునుగోడు నియోజకవర్గంలో బూత్స్థాయి నుంచి నేతలను మోహరించి, ప్రజలను అన్ని రకాలుగా ప్రభావితం చేసి, కచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని అమిత్షా హామీ ఇచ్చినట్టు తెలిసింది. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ (22వేలు) కన్నా అధిక మెజార్టీ తెప్పిస్తానని బలంగా చెప్పినట్టు సమాచారం.