హైదరాబాద్, అక్టోబర్ 25 ( నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ కరోనా కన్నా ప్రమాదకరమని, ఈ విషయాన్ని తెలంగాణ రైతన్నలు గమనించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ను నమ్మితే నట్టేట మునగడం ఖాయమని పేర్కొన్నారు. కరోనా విపత్తులోనూ సీఎం కేసీఆర్ ఎంతో ఉన్నతంగా ఆలోచించి రైతుబంధు ఆగనివ్వలేదని, రాష్ట్రంలోని ఏడు వేల పైచిలుకు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొన్నారని గుర్తుచేశారు.
కర్ణాటకలో అడ్డగోలు హామీలిచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆరు నెలలు కాకముందే వాటి అమలుపై చేతులేత్తిసిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతుబంధు పంపి ణీ చేయొద్దని ఏఐసీసీ ఇంచార్జి మాణిక్రావు ఠాక్రే.. ఎన్నికల సంఘానికి లేఖ రాయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుబంధు వద్దనడం కాంగ్రెస్ అనైతికతకు నిదర్శనమని విమర్శించారు. రైతన్నలు కాంగ్రెస్ నేతల కుట్రలను గమనించాలని కోరారు.