కొండాపూర్ : కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలను వెంటనే అమలు చేయాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ బొబ్బా నవత రెడ్డి ( Navata Reddy ) డిమాండ్ చేశారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద పంపిణీ చేస్తున్న రూ.300 చీరలతో మహిళల ( Indiramma sarees ) ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో భాగంగా అత్తకు రూ.4,000, కోడలికి రూ.2,500 ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇళ్లు, పెళ్లి కానుకగా తులం బంగారం, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, పెరిగిన పెన్షన్ల ఎన్నికల హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన ప్రభుత్వం హామీలను విస్మరించి కేవలం ఇందిరమ్మ చీరల పంపిణీతో మభ్యపెట్టేందుకు చూస్తుందన్నారు.
మియాపూర్ సర్కిల్ పరిధి చందానగర్ డివిజన్ కైలాష్ నగర్ కాలనీలో మహిళా భవన నిర్మాణం కోసం కేటాయించిన సుమారు 4 వేల గజాల ప్రభుత్వ భూమిని విద్యుత్ శాఖ ఆక్రమించిందని నవతరెడ్డి ఆరోపించారు. విద్యుత్ శాఖ భూమి ఆక్రమణపై స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.