హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): అయోధ్యలో జరుగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక ధోరణిని బయటపెట్టుకున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 500 ఏండ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న రామమందిర నిర్మాణం కల సాకారమైందని చెప్పారు. శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు.. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు, కవులు, కళాకారులు, సాధుసంతులను, సామాజిక సంస్థలను, సీఎంలను, రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నదని చెప్పారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ను శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానించిందని తెలిపారు. అభద్రతాభావంతో, కుహనా లౌకికవాదంతో, సూడో సెక్యులరిస్టులుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తూ ఆహ్వానాన్ని తిరస్కరించారని మండిపడ్డారు. ఓటుబ్యాంకు రాజకీయ కోణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏండ్లుగా శ్రీరాముడి ఉనికినే దాచిపెట్టిందన్నారు. అయోధ్య నుంచి వచ్చిన పూజిత అక్షింతలను భక్తిభావనతో ప్రతి ఇంటికి పంపిణీ చేస్తుంటే సికింద్రాబాద్లోని సింధూ కాలనీలో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు.