హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘కౌలు రైతులను మేం గుర్తించం. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతుల మెడలో దూలం కట్టదలుచుకోలేదు’.. కౌలు రైతుల గురించి సీఎం కేసీఆర్ అనేక సార్లు చెప్పిన మాట ఇది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు కౌలు రైతుల పేరుతో గుదిబండను తగిలిస్తామని స్పష్టంగా చెప్పింది. కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎలా ఇస్తారని రేవంత్రెడ్డిని ప్రశ్నిస్తే ‘2011లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు చట్టాన్ని అమలు చేస్తాం’ అని చెప్పారు. అంటే.. కౌలు రైతులకు మళ్లీ హక్కులు కల్పిస్తారన్న మాట. 2011 కౌలు రైతు చట్టం ప్రకారం.. రైతులు, కౌలు రైతులు ఒప్పందాలు చేసుకోవాలి. వాటిని ధ్రువీకరిస్తూ వీఆర్వో సంతకం చేయాలి. వారికి ప్రభుత్వం కౌలు గుర్తింపు కార్డు ఇస్తుంది. ఈ కార్డు ఉన్నవారికి విత్తనాలు, ఎరువులు అందుతాయి.
ఆయా కౌలు రైతులకు బ్యాంకులు రూ.లక్ష వరకు రుణాలు ఇవ్వాలని ఆర్బీఐ అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. కొన్ని సందర్భాల్లో భూ యజమానులు ఒప్పుకోకపోతే వీఆర్వో, గ్రామ పంచాయతీ అధికారులు నేరుగా కౌలు రైతు గుర్తింపు కార్డులు జారీ చేయవచ్చు. ఈ నిబంధనలన్నీ రైతు మెడకు గుదిబండగా మారాయి. ఇంకో ప్రమాదం ఏమిటంటే.. కౌలు రైతులు ముందుగా పహాణీల్లో ‘కౌలు కాలమ్’లో చేరేవారు. అందులో కొందరు ఒకటి, రెండేండ్ల తర్వాత వీఆర్వోలు, ఇతర అధికారులకు లంచాలు ఇచ్చి కౌలు కాలమ్ నుంచి యజమాని కాలమ్లోకి పేర్లు మార్పించేవారు. దీంతో అసలు రైతు భూమిపై హక్కులు కోల్పోయి లబోదిబోమనేవారు.
కొన్నేండ్లుగా కౌలు చేస్తున్నాం కాబట్టి ఆ భూమిపై హక్కులు కల్పించాలంటూ కోర్టులకు ఎక్కిన కౌలు రైతులు ఎందరో ఉన్నారు. ఇక కౌలు రైతు కార్డులు పొందిన వారు ఎలాంటి పూచీకత్తు లేకుండానే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే వెసులుబాటు ఉండేది. మరి వారు చెల్లించకపోతే?, కనీసం జప్తు చేయడానికి పూచీకత్తు కూడా ఉండేది కాదు. దీంతో బ్యాంకు అధికారులు రైతును ఇబ్బంది పెట్టేవారు. తర్వాతి ఏడాది రైతు రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే, కౌలు రైతుల రుణాలు చెల్లించేవరకు ఇవ్వబోమంటూ వెనక్కి పంపేసిన సందర్భాలు ఎన్నో. మరికొన్ని సందర్భాల్లో రైతు తన పొలంలో కొంత విస్తీర్ణమే కౌలుకు ఇచ్చినా, మొత్తం విస్తీర్ణం కౌలు కింద నమోదయ్యేది. ఫలితంగా ప్రభుత్వ పథకాలు, రుణమాఫీ వంటివి అందేవి కాదు. దీంతో కౌలుకు ఇచ్చిన పాపానికి రైతుకు శిక్ష పడేది. కాంగ్రెస్కు ఓటేస్తే కౌలు రైతులు అసలు యజమానులకు మెడ మీద కత్తిగా మారతారు.