గృహలక్ష్మి పథకం మాకు అందటం లేదు. ఆ పథకం కింద ప్రభుత్వం ఇస్తున్నామని చెప్తున్న డబ్బు మాకెందుకు ఇవ్వరు? మీరేమో ఇస్తున్నామని ప్రకటించారు. ఇప్పుడు వచ్చి గృహలక్ష్మి పథకం వస్తున్నదా అని అడుగుతున్నారు. మాకు మాత్రం ఎవ్వరూ ఇవ్వటం లేదు.
Karnataka | హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో కాంగ్రెస్ చేతులెత్తేసింది. ఐదు గ్యారెంటీలంటూ ఆర్భాటాలకు పోయిన ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ పథకాల అమలులో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పథకాల అమలు సాధ్యం కాదని తేలిపోవటంతో అడ్డమైన కొర్రీలు పెడుతూ, అలవికాని నిబంధనలు పెడుతూ లబ్ధిదారులను సగానికి సగం తగ్గించే ఎత్తులు వేసింది. దీంతో కాంగ్రెస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారు. ఐదు గ్యారెంటీల వల్ల వేరే పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు పైసా కూడా మిగలటం లేదని నాలుగైదు రోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యే కే శడాక్షరి పబ్లిక్గానే ఆవేదన వ్యక్తంచేశారు. తాజాగా సీఎం సిద్ధరామయ్యనే మహిళలు గృహలక్ష్మి పథకం కోసం నిలదీయటంతో ఈ పథకాల అమలులో కాంగ్రెస్ చేతులెత్తేసినట్టు తేలిపోయింది.
పథకాలు అమలుచేయలేక కర్ణాటక ప్రభుత్వం అడ్డదిడ్డమైన షరతులతో వాటిని నీరుగారుస్తున్నది. పెన్షన్ పథకమే అందుకు ఉదాహరణగా నిలుస్తున్నది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు అందిస్తున్నది. అదికూడా ఈ మూడు వర్గాలకు మూడు రకాలుగా ఇస్తున్నది. నిబంధనలు కూడా వేర్వేరుగా పెట్టింది. ఈ పథకం ద్వారా వృద్ధులకు ఇస్తున్నదే రూ.600 కాగా, అది పొందటానికి కూడా విస్మయపరిచే కండిషన్ పెట్టింది. ఏడాదికి రూ.20 వేలకంటే ఎక్కువ సంపాదన ఉన్నవారు పెన్షన్కు అర్హులు కాదని ప్రకటించింది. అంటే నెలకు రూ.1666 కంటే ఎక్కువ ఆదాయం ఉంటే పెన్షన్కు అర్హత ఉండదు. ఈ మొత్తంతో ఒక వ్యక్తి నెలకు సరిపడా బియ్యం కూడా కొనుక్కోలేడు. అలాంటప్పుడు అంత తక్కువ ఆదాయంతో అసలు మనుషులు బతకగలరా? అని సామాజికవేత్తలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అంత తక్కువ ఆదాయం ఉన్నవారు ఎవరూ ఉండరని తెలిసే కర్ణాటక ప్రభుత్వం ఈ నిబంధన విధించిందని చెప్తున్నారు. అంతేకాకుండా వ్యక్తి బ్యాంకు అకౌంట్లో రూ.10,000 మించి డబ్బు ఉన్నా ఈ పథకానికి అనర్హులే. చాలా బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమమ్ (తప్పనిసరిగా ఉంచాల్సిన డబ్బు) బ్యాలెన్సే రూ.5000 ఉండాలని కండిషన్ పెడుతున్నాయి. అలాంటప్పుడు ఈ కండిషన్ పెట్టడంలో ఏమైనా ఔచిత్యం ఉన్నదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ పథకం కింద వృద్ధుల్లోనే ఏకమొత్తంగా కాకుండా లబ్ధిదారులను మూడు వర్గాలుగా విభజించి పెన్షన్ ఇస్తున్నారు. అదికూడా ప్రాథమిక అర్హత 60 ఏండ్లు దాటితేనే. తెలంగాణలో ఆసరా పెన్షన్ 57 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఒకేలా ఇస్తున్నారు. కర్ణాటకలో మాత్రం 60-64 ఏండ్ల మధ్య ఉన్నవారికి రూ.600, 65-80 ఏండ్ల మధ్యవారికి రూ.1000, 80 ఏండ్లు దాటినవారికి రూ.1200 ఇస్తున్నారు. 80 ఏండ్లు దాటినవారు చాలా తక్కువ మంది ఉంటారు. మొదటి శ్లాబులోనే అధికంగా ఉంటారు. అది తెలిసే కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ అతి తక్కువగా రూ.600 పెట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దివ్యాంగులను కూడా కర్ణాటక ప్రభుత్వం దొంగదెబ్బ తీసింది. ఈ పథకానికి అర్హులు కావాలంటే వార్షికాదాయం రూ.1.2 లక్షలకంటే తక్కువ ఉండాలి. అదీకాక వైకల్యం తీవ్రతనుబట్టి పెన్షన్ నిర్ణయించారు. 40-74 శాతం వైకల్యమున్న వారికి రూ.800, 75 శాతానికి మించి వైకల్యమున్న వారికి రూ.1600 మాత్రమే పెన్షన్ అందిస్తున్నది. తెలంగాణలో ఎలాంటి వైకల్యమున్నా అందరికీ సమానంగా రూ.4,016 పెన్షన్ ఇస్తున్నది. కర్ణాటకలో 13.24 లక్షల మంది గుర్తింపు పొందిన దివ్యాంగులున్నారు. ప్రభుత్వం విధించిన గరిష్ఠ వార్షికాదాయ నిబంధన వల్ల ఈ పథకానికి 5.75 లక్షల (43.4%) మంది మాత్రమే అర్హత పొందారు. ఇలా లక్షలమంది అర్హతగలవారిని పథకాలకు దూరం చేస్తూ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో వచ్చే రెవెన్యూ మొత్తం ఐదు గ్యారెంటీలకే సరిపోవటం లేదు. ఇతర పథకాలు, కార్యక్రమాలకు ఇప్పుడు నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. ఐదు హామీలు మనల్ని ఇతర అభివృద్ధి పనులు చేయకుండా పడుకోబెట్టాయి.