Vemula Prashanth Reddy | వేల్పూర్, మార్చి 26: కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతోనే కరువు ఏర్పడిందని, ఫలితంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో మీడియాతో మాట్లాడారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని అన్నా రు. కేసీఆర్ పాలనలో రైతులకు పుష్కలంగా సాగునీరు, 24 గంటల కరెంట్ ఇచ్చామని, రైతుబంధు కూడా సీజన్ ఆరంభంలోనే విడుదల చేశామని అన్నారు. కానీ కాంగ్రెస్ హయాంలో సాగునీరు లేక, సరిగ్గా కరెంట్ లేక కాలిపోతున్న మోటర్లతో రైతులకు దుఃఖమే మిగిలిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా దిగువ నుంచి గోదావరి నీళ్లను తెచ్చి శ్రీరాంసాగర్ నింపి, వరద కాలువ ద్వారా ఏడాదంతా పంటలకు సాగునీరందించినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు నీళ్లు ఇవ్వలేక పోతుందని, పైగా ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని కిందకి తరలిస్తూ ఇక్కడి రైతాంగానికి అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. దీనికి కాం గ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కప్పలవాగు, పెద్దవాగులో అనేక చెక్డ్యామ్లు తమ ప్రభుత్వ హయాంలో నిర్మించినట్టు చె ప్పారు. ప్యాకేజీ 21 ద్వారా కప్పలవాగు, పెద్దవాగు లో నీళ్లు కూడా వదిలి వాటిని నీటితో నింపితే ఆ వాగు వెంట ఉండే గ్రామాల్లో బోర్లలోకి నీళ్లు వచ్చి సుమారు 40 వేల ఎకరాలకు ప్రయోజనం కలిగేదని అన్నారు. వాగుల్లో 0.5 టీఎంసీల నీరు వదలాలని రైతుల తరపున విన్నవించినా, లేఖలు రాసిన ఈ చెవిటి ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ, వరికి రూ.500 బోనస్ వంద రోజుల్లోనే ఇస్తామని మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ.. 110 రోజులవుతున్నా ఎందుకు హామీలను అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
బ్యాంకు అధికారులు అప్పులు కట్టాలని రైతులకు లీగల్ నోటీసులు ఇవ్వడం సరికాదని వేముల అన్నారు. రైతులెవరూ రుణాలు కట్టాల్సిన అవసరం లేదని, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ కంటే ఎక్కువ, కౌలు రైతులకు కూడా సాయం చేస్తామని హామీనిచ్చిందని, అయితే ఇప్పటివరకు 3 ఎకరాలకు మించి ఉన్న రైతులకు పంట పెట్టుబడి డబ్బులు వేయలేదని దుయ్యబట్టారు.
పెట్టుబడి సాయానికి ఎన్నికల కోడ్ అడ్డు కాకూడదని, కాంగ్రెస్ నేతల మాదిరిగా తాము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయబోమని వేముల స్పష్టం చేశారు. రైతులకు సాయం విషయంలో రాజకీయాలకు పాల్పడబోమని అన్నారు. రాజకీయాలు మాని రైతులకు మేలు చేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీని 100 ఫీట్ల లోతులో బొందపెడుతా, పేగులు మెడలో వేసుకుంటానని రేవంత్రెడ్డి చిల్లర మాటలు మాని.. రైతుల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు.