ఎన్నికలు రాగానే.. క్యూ కడ్తరు. ఇది చేస్తం, అది చేస్తం.. అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తరు..నిజమని నమ్మి ఓటేసి గెలిపించామా?? ఆనక చుక్కలు చూపిస్తరు! మాటమీద నిలబడని కాంగ్రెస్ రివాజు ఇది. అధికారమే పరమావధిగా అడ్డగోలు హామీలివ్వడం.. ఆపై వాటిని అటకెక్కించడం హస్తానికే చెల్లింది. 50 ఏండ్ల చరిత్రను తిరగదోడినా.. పక్క రాష్ర్టాల్లో జరుగుతున్న తంతును చూసినా.. ఇట్టే అర్థం చేసుకోవచ్చు. హిమాచల్ప్రదేశ్లో తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనను విశ్లేషిస్తే, ఆ పార్టీ మోసపూరిత హామీల చిట్టా బయటపడుతుంది.
జనంలేని గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్
టిబెట్ సరిహద్దుల్లో లాహౌల్, స్పితి జిల్లాల్లోని చిత్కుల్ గ్రామంలో మహిళలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం స్కీంను హిమాచల్ సర్కారు ఇటీవల పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టింది. హిమాచల్ ప్రదేశ్ దేశంలో అత్యల్ప జనసాంద్రత ఉన్న రాష్ర్టాల్లో ఒకటి. అందునా ఈ గ్రామం దేశానికి చివరిది. అక్కడ జనాలే అంతంతమాత్రం.. అలాంటి చోట కాంగ్రెస్ సర్కారు ఈ పథకాన్ని ప్రారంభించటం గమనార్హం. చిత్కుల్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కలిపి సుమారు 9 వేల మందిని ప్రాథమిక లబ్ధిదారులుగా ఎంపిక చేసిన ప్రభుత్వం.. 300 మందికి మాత్రమే డబ్బులను జమ చేసింది. అది కూడా పథకం ప్రారంభించిన జూన్ నెలలో మాత్రమే. ఆ తర్వాత డబ్బుల చెల్లింపులు నిలిచిపోయాయి. కేవలం ప్రచారం కోసమే సర్కారు ఇలా చేసింది. దీంతో కాంగ్రెస్ చిత్తశుద్ధిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లకోసం కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఆరు హామీలిచ్చింది.. ఇంకేం.. రాష్ట్ర ప్రజల జీవితాలే మారిపోతాయని ఆ పార్టీ నేతలు కన్నూమిన్నూ కానక ప్రచారం చేస్తున్నారు. సరిగ్గా 9 నెలల క్రితం హిమాచల్ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ఇలాంటి హామీలనే ఇచ్చింది. వాగ్దానాల వర్షం కురిపించి, ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత హామీలను గాలికొదిలేసింది. పోలింగ్కు ముందు 10 గ్యారెంటీలు అంటూ ప్రకటించిన ఆ పార్టీ, పగ్గాలు చేపట్టి తొమ్మిది నెలలు గడుస్తున్నా.. వాటి అమలును పట్టించుకోవట్లేదు. ప్రతిపక్ష పార్టీల విమర్శలు, ప్రజాగ్రహం వెళ్లువెత్తిన ప్రతిసారి కమిటీల పేరిట కాలయాపన చేస్తూ తప్పించుకొంటున్నది. హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీకి కిందటేడాది నవంబర్లో ఎన్నికలు జరిగాయి. ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ 10 గ్యారంటీ స్కీమ్ల పేరిట ఆర్భాటపు హామీలిచ్చింది. 18-60 ఏండ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున సాయం, ప్రతీ ఇంటికి నెలకు 300 యూనిట్ల ఉచిత కరెంటు, లక్ష ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన, ప్రతీ గ్రామంలో మొబైల్ క్లినిక్ల ఏర్పాటు, పారిశ్రామిక వేత్తలకు వడ్డీలేని రుణాలు, ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్టార్టప్ ఫండ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ హామీలు ఈ జాబితాలో ఉన్నాయి.
అమలు తీరిది..
ఆర్భాటపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, వాటి అమలును మాత్రం పక్కనబెట్టింది. పగ్గాలు చేపట్టిన ఆరు నెలలకు క్యాబినెట్ సమావేశంలో ‘మహిళలకు ఆర్థిక సాయం స్కీమ్’కు ఆమోద ముద్ర వేశారు. జూన్ నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించినా అమలుకావట్లేదు. మహిళలనుంచి నిరసన వ్యక్తం కావడంతో 4 నెలల మొత్తాన్ని ఒకేసారి బ్యాంకు ఖాతాలో వేస్తామని మోసపూరిత వాగ్దానం చేసింది. లక్ష ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రకటన చేస్తానన్న సర్కారు.. మాట తప్పింది. ఉచిత విద్యుత్తు, నియోజకవర్గానికి 10 కోట్ల స్టార్టప్ ఫండ్, మొబైల్ క్లినిక్లు, వడ్డీలేని రుణాల వంటి హామీలను కూడా అటకెక్కించింది.
లబ్ధిదారుల్లో కోత
గ్యారెంటీల అమలును వాయిదావేయడమే కాదు.. నిబంధనల పేరిట కొర్రీలు పెడుతూ లబ్ధిదారుల కోతకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. హిమాచల్ప్రదేశ్ మొత్తం జనాభాలో 18-60 ఏండ్ల మధ్య వయసున్న మహిళల సంఖ్య 22 లక్షల వరకు ఉండగా, 8.21 లక్షల మందే అర్హత సాధించారని చెప్తూ ఓ కమిటీ పేరిట ప్రభుత్వం నివేదికను ఇప్పించింది. ఆశ, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, ప్రభుత్వ సిబ్బంది, మాజీ సైనికోద్యోగులు, పెన్షనర్లు, తాము నిర్ణయించిన ఆదాయ పరిమితి స్లాబ్లోకి రానివాళ్లు, పింఛన్లు తీసుకొంటున్న మహిళలకు అర్హత లేదని తేల్చేసింది. ఏకంగా 60 శాతం మంది మహిళలను స్కీంకు దూరం చేసింది. అర్హులైన చాలామంది పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించిందని మహిళలు ఆరోపిస్తున్నారు. పథకం ప్రారంభమైనట్టు ప్రచారం చేసుకోవడానికి కొద్ది మందికి మాత్రమే జూన్లో ఖాతాల్లో రూ. 1,500 జమ చేశారని మండిపడ్డారు. ఇతర గ్యారంటీ పథకాల అమలుకు కమిటీల ఏర్పాటు పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ధ్వజమెత్తారు. హిమాచల్తో పాటు కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కూడా హామీలను అమలు చేయని కాంగ్రెస్.. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను మాత్రం ఎలా అమలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు నిలదీస్తున్నారు.